బండి సంజయ్ అరెస్ట్: హైకోర్టులో బీజేపీ పిటీషన్ - అత్యవసర విచారణ కోసం
కరీంనగర్: వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. భారతీయ జనత పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారం- దుమారం రేపుతోంది. అధికార టీఆర్ఎస్పై మాటల దాడి తీవ్రతరమైంది. బీజేపీ శ్రేణులన్నీ.. ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను లక్ష్యంగా చేసుకున్నాయి. విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి.
బండి సంజయ్ అరెస్ట్తో ఉద్రిక్తత..
అనుమతి లేకపోయినప్పటికీ.. తన పాదయాత్రను ప్రారంభించడానికి భైంసా వెళ్లడానికి ప్రయత్నించిన బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోరుట్ల సమీపంలోని వెంకటాపురం వద్ద బండి సంజయ్ వెళ్తోన్న వాహనాన్నిఅడ్డగించారు. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇది కాస్తా బీజేపీ నేతల్లో ఆగ్రహావేశాలకు కారణమైంది. ఆయన వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులు, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కరీంనగర్లో మోహరింపు..
బండి సంజయ్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను కరీంనగర్ జిల్లాలోని ఆయన నివాసానికి తరలించారు. ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటి ముందు పోలీసులను మోహరింపజేశారు. ఆయన భైంసా వెళ్లకుండా ముందుజాగ్రత్త చర్యగా గృహ నిర్బంధంలో ఉంచినట్లు పేర్కొంటోన్నారు. భైంసా సమస్యాత్మక ప్రాంతం కావడం, శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
పాదయాత్ర అనుమతి కోసం..
అదే సమయంలో- బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. బండి సంజయ్ నిర్వహించ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి ఇవ్వలంటూ హౌస్ మోషన్ పిటీషన్ను దాఖలు చేశారు. పాదయాత్ర చేపట్టడానికి తొలుత అనుమతి ఇచ్చిన పోలీసులు- చివరి నిమిషంలో అడ్డుకున్నారని పేర్కొన్నారు. అత్యవసర పిటీషన్ కింద దీన్ని విచారించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఈ మధ్యాహ్నం నుంచి పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉన్నందున- ఆ లోగా ఈ పిటీషన్పై విచారణ చేపట్టాలని కోరారు.
బండి సంజయ్ అరెస్ట్ పట్ల నిరసన
బండి సంజయ్ అరెస్ట్ పట్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు భగ్గుమంటోన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందంటూ విమర్శించారు. ఒక పార్టీకి అధ్యక్షుడిగా, లోక్సభ సభ్యుడిగా ఉన్న బండి సంజయ్కు రాష్ట్రంలో తిరిగే స్వేచ్ఛ లేదా అంటూ ప్రశ్నించారు. భైంసా సభను అడ్డుకోవడం వెనుక కేసీఆర్ కుట్ర ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ విమర్శించారు. కేసీఆర్ తనకు తాను నయా నిజాం అనుకుంటున్నాడంటూ ధ్వజమెత్తారు.
ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేదంటూ..
ఇవ్వాళ్టి నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టాల్సి ఉంది. నిర్మల్ జిల్లాలోని భైంసాలో తన పాదయాత్రను ఆయన ప్రారంభించాల్సి ఉంది. దీనికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. భైంసా అత్యంత సమస్యాత్మక, సున్నిత ప్రాంతంగా భావిస్తోండటం వల్లే అనుమతి లభించలేదని చెబుతున్నారు. శాంతిభద్రతల సమస్య ఏర్పడొచ్చనే ఉద్దేశంతో ముందుజాగ్రత్త చర్యగా ఆయనను పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వలేదని తెలుస్తోంది.
జిన్పింగ్కు వ్యతిరేకంగా చైనాలో ఆందోళనలు ఉధృతం - అరెస్టులతో ఉద్రిక్తత