విషాదం : కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అంగన్వాడీ టీచర్ మృతి...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నాలుగు రోజుల క్రితం కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఓ అంగన్వాడీ టీచర్ బుధవారం(ఫిబ్రవరి 10) మృతి చెందింది. కరోనా టీకా వికటించడం వల్లే ఆమె మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే... అశ్వారావుపేట మండలం నందిపాడు గ్రామానికి చెందిన పద్దం చిన్ని(27)స్థానిక అంగన్వాడీ కేంద్రంలో టీచర్గా పనిచేస్తోంది. నాలుగు రోజుల క్రితం గుమ్మడవల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అప్పటినుంచి ఆమె వాంతులు,జ్వరం,విరేచనాలతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆమెను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడే చికిత్స పొందుతూ ఆమె బుధవారం(ఫిబ్రవరి 10) తెల్లవారుజామున మృతి చెందారు. కరోనా వ్యాక్సిన్ వికటించడం వల్లే చిన్ని చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
గత నెలలో నిర్మల్ జిల్లాలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా కుంటాల పబ్లిక్ హెల్త్ కేర్ సెంటర్లో 108 ఆంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్న విఠల్(42) అనే వ్యక్తి కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రోజు రాత్రే మృతి చెందాడు. జనవరి 19,ఉదయం 11.30గంటలకు అతను వ్యాక్సిన్ తీసుకోగా.. అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ఛాతిలో విపరీతమైన నొప్పితో బాధపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించగా తెల్లవారుజామున 5గంటలకు మృతి చెందాడు. కరోనా టీకా వికటించడం వల్లే విఠల్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాసలోనూ ఇటీవల ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పలాస పట్టణంలో వాలంటీర్గా పనిచేస్తున్న లలిత(28) ఫిబ్రవరి 5న కరోనా వ్యాక్సిన్ తీసుకున్నది. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె ఫిబ్రవరి 8న మృతి చెందింది. టీకా వికటించడం వల్లే తమ బిడ్డ చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. లలితతో పాటు వ్యాక్సిన్ తీసుకున్న 8 మంది వాలంటీర్లు,వీఆర్వో ప్రసాద్ స్వల్ప జ్వరం,తలనొప్పితో బాధపడ్డారు.