తెలంగాణ కోసం బాబు ఫైట్, కేసీఆర్ వద్దన్నా ఘనస్వాగతం: ఎవరేమన్నారంటే? మీకో దండమంటూ.. గద్దర్
ఖమ్మం: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహాకూటమి లేదా ప్రజా కూటమి ఖమ్మం జిల్లాలో బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు కూటమి నేతలు హాజరయ్యారు.
ఈ వేదికపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి, ప్రజా యుద్ధ నౌక గద్దర్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తదితరులు హాజరయ్యారు.
కాంగ్రెస్, టీడీపీలది పవిత్ర కలయిక
కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ... కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలది అపవిత్ర పొత్తు అంటున్నారని, కానీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమని చెప్పారు. దేశ ప్రయోజనాల కోసం తాము కలుస్తున్నామని, ఇదే పవిత్రమైన కలయిక అన్నారు. నీళ్లు, నిధులు, ఆత్మగౌరవం నాశనం అవుతున్నాయని చెప్పారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు.
అందుకే రాహుల్-చంద్రబాబులు కలిశారు
టీడీపీ నేత నామా నాగేశ్వర రావు మాట్లాడుతూ... తమ పార్టీ అధినేత చంద్రబాబును తెరాస నేతలు అడుగడుగునా అడ్డుకుంటారని హెచ్చరించారని, కానీ తెలంగాణ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారని చెప్పారు. ప్రాజెక్టులు అడ్డుకోవడానికి చంద్రబాబు కారణమని మాయమాటలు చెబుతున్నారని కేసీఆర్ పైన నిప్పులు చెరిగారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూని అవుతున్న సమయంలో, దేశ భవిష్యత్తు కోసం చంద్రబాబు, రాహుల్ గాంధీలు కలిశారని చెప్పారు. కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కయ్యారని నామా నాగేశ్వర రావు అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఉండొద్దని మోడీ, తెలంగాణలో టీడీపీ ఉండొద్దని కేసీఆర్ భావిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసిందే చంద్రబాబు అన్నారు. చంద్రబాబును అడ్డుకోవాలని చూస్తే ఖమ్మం ప్రజలు అడుగడుగునా స్వాగతం పలికారని చెప్పారు.
చంద్రబాబు తెలంగాణ కోసం కొట్లాడారు
తెలంగాణకు నీటి కోసం చంద్రబాబు బాబ్లీ ప్రాజెక్టు వద్ద ఆందోళన చేపట్టారని, ఆయనతో పాటు ఐదు రోజులు తామూ జైల్లో ఉన్నామని నామా నాగేశ్వర రావు చెప్పారు. నాలుగున్నర పాలనలో కేసీఆర్ అందరినీ ఇబ్బంది పెట్టారన్నారు. మోడీతో కేసీఆర్ జత కలిశారన్నారు. విభజన చట్టంలో బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇస్తామని చెప్పారని, దానిని ఇప్పటి వరకు ఎందుకు తీసుకు రాలేదో కేసీఆర్ చెప్పాలన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదన్నారు. బీజేపీతో కుమ్మక్కు కావడం వల్లే రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు రాలేదన్నారు. ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు మహాకూటమి గెలువాలన్నారు. ప్రజా కూటమి కలిసి సాగాలన్నారు. కేంద్రాన్ని తెరాస ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు?
ఢిల్లీలో మోడీ, తెలంగాణలో కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 12న కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితిలతో కూడిన ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడబోతుందని చెప్పారు. నిరంకుశ పాలన నుంచి కాపాడేందుకే ఈ పొత్తు అన్నారు. కేసీఆర్ను నమ్మి మోసపోయామని అన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయని చెప్పారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులపై కేంద్రాన్ని తెరాస ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. తెలంగాణకు గులాబీ చీడ పట్టందని తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ అన్నారు. పెద్ద పాలేరులా ఉంటానని పెత్తందారీలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడిందన్నారు.
సోనియా గాంధీ సాహసోపేత నిర్ణయం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి అమరుల త్యాగం ఎంత ముఖ్యమైందో సోనియా గాంధీ సాహసోపేత నిర్ణయం అంతే ముఖ్యమని మందకృష్ణ మాదిగ చెప్పారు. తెలంగాణలో తెరాస అధికారంలోకి వస్తే దళిత ముఖ్యమంత్రి అని చెప్పి, తానే సీఎం అయ్యారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. పలు సందర్భాల్లో తమను జైల్లో పెట్టారని, కోదండరాం ఇంటిపైకి వెళ్లారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం నియంతృత్వంగా మారిందన్నారు.
చంద్రబాబు, రాహుల్ గాంధీలూ.. మీకో దండం
దేశంలో, రాష్ట్రంలో సేవ్ సెక్యులరిజం, సెవ్ కంట్రీ అంటూ బయలుదేరిన మీ ఇద్దరికీ దండం అంటూ చంద్రబాబు, రాహుల్ గాంధీలను ఉద్దేశించి గద్దర్ అన్నారు. అక్కడ మోడీ, ఇక్కడ కేసీఆర్ దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటున్నారని చెప్పారు. అనంతరం గద్దర్ను చంద్రబాబు ఆలింగనం చేసుకున్నారు.