Pic Talk: ఈయనే మా విక్రమ్-
ఖమ్మం: ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో నిర్వహించిన మొట్టమొదటి జాతీయ స్థాయి బహిరంగ సభ- భారత్ రాష్ట్ర సమితి లక్ష్యాన్ని, కేసీఆర్ ఉద్దేశాన్ని చాటి చెప్పింది. భవిష్యత్తులో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎలాంటి పాత్రను పోషిస్తారనే విషయాన్ని ఖమ్మం సభ స్పష్టం చేసింది. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించబోతోన్నారనే విషయాన్ని ఖమ్మం సభ ద్వారా స్పష్టం చేశారు గులాబీ బాస్.
తొలి అడుగే గ్రాండ్ సక్సెస్..
ఖమ్మంలో నిర్వహించిన భారీ సభ ద్వారా కేసీఆర్- జాతీయ రాజకీయాలపై అడుగు వేశారు. ఈ తొలి అడుగు అద్దిరిపోయింది. ఈ సభకు హాజరైన మూడు జాతీయ పార్టీల నాయకులు ఆయనకు అండగా నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై పోరాటానికి తమ మద్దతు ప్రకటించారు.
మూడు పార్టీల మద్దతు..
జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటోన్న ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్ వాది పార్టీ, వామపక్షాల మద్దతును కూడ గట్టడంలో విజయం సాధించారు. వారిని ఒకే వేదికపైకి తీసుకుని రాగలిగారు. బీజేపీ పెద్దలకూ హెచ్చరికలను జారీ చేశారాయన. 2024 తరువాత ప్రధాని మోదీ ఇంటికి వెళ్లడం ఖాయమంటూ గర్జించారు. తాము ఢిల్లీకి వెళ్తామని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనీ ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తమ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాబోతోందని అన్నారు.
ఖమ్మంలో భేటీ..
ఇదిలావుండగా.. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అదే సమయంలో కేసీఆర్ ను కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఖమ్మంకు వచ్చిన కేసీఆర్ ను భట్టి విక్రమార్క కలుసుకున్నారు. జిల్లా అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన కొన్ని ప్రతిపాదనలను అందజేశారు. తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న మథిర నియోజకవర్గం అభివృద్ధి విషయాన్నీకేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఆప్యాయంగా..
తనను కలవడానికి వచ్చిన మల్లు భట్టి విక్రమార్కను కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు. భుజాలపై చేతులు వేసి.. నవ్వుతూ మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించారు. ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, సమాజ్ వాది పార్టీ అధినేత, ఉత్తర ప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజాకు భట్టి విక్రమార్కను పరిచయం చేశారు. ఆ సమయంలో ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నాయకులు అక్కడే ఉన్నారు.