ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో రైతు ఆత్మహత్యాయత్నం.. అదే కారణం...?
ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్లో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన తోటి రైతులు హుటాహుటిన అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. నేలకొండపల్లికి చెందిన రైతు గడ్డం లింగయ్య 15 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి ధాన్యం పండించాడు. నెల రోజుల క్రితం పంట కోసి ధాన్యాన్ని వ్యవసాయ మార్కెట్కు తరలించాడు. ఇన్ని రోజులు గడిచినా మార్కెట్లో కాంటాలు వేయకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. మంగళవారం(మే 18) మార్కెట్ యార్డులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.
లింగయ్య ఆత్మహత్యాయత్నాన్ని గమనించిన తోటి రైతులు వెంటనే అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో లింగయ్య చికిత్స పొందుతున్నాడు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్య వైఖరే లింగయ్య ఆత్మహత్యాయత్నానికి కారణమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి తాము పంటలు పండిస్తున్నామని... మార్కెట్లో అధికారులు పంట కొనుగోలు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. అధికారుల తీరును నిరసిస్తూ స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పలుచోట్ల రైతుల పరిస్థితి ఇలాగే ఉందన్న విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో ఈసారి యాసంగి వరి సాగు రెట్టింపయింది. దాదాపు 1కోటి 32 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. రైతు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 7,183 ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా... 6144 కేంద్రాలు ఏర్పాటు చేసింది. అయితే కొన్ని ఐకేపీ కేంద్రాల్లో రైతులకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్ని చోట్ల గోనె సంచులు లేవని ధాన్యాన్ని కాంటా వేయడం లేదు. ప్రభుత్వం మాత్రం 14 కోట్ల 73 లక్షల గోనె సంచులు అందుబాటులో ఉన్నాయని చెబుతోంది.
అలాగే ధాన్యం తరలింపులో కూలీల కొరత,రవాణా సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. వీటికి తోడు మిల్లర్లు కడ్తా పేరుతో ఐదు కిలోల వరకు తరుగు తీస్తున్నారని రైతులు వాపోతున్నారు. అధికారులు ఈ విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.