అమానుషం: జైల్లో మహిళా రైతులను కొట్టారు, టాయ్లెట్లను కడించారు: రేవంత్ రెడ్డి ఫైర్
హైదరాబాద్: ఖమ్మం జైలులో మహిళా రైతుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవ హక్కులను ఉల్లంఘించిన అధికారులను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్కు రేవంత్ లేఖ రాశారు.
సెప్టెంబర్ 17లోపు పోడు భూములకు పట్టలివ్వాలని, రాష్ట్రంలోని ఎస్సీ, గిరిజనులకు రూ. 10 లక్షలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఐటీడీఏల పునురుద్ధరణకు నిధులు విడుదల చేయాలని కోరారు. సమస్యలు పరిష్కంచకుంటే ప్రభుత్వం పోరు తప్పదని హెచ్చరించారు.

ఇది ఇలావుండగా, ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్లో ఆగస్టు 6న పోడు భూముల విషయమై అటవీశాఖ సిబ్బంది, పోడు రైతుల మధ్య వివాదం జరిగింది. తమపై దాడులు చేశారంటూ అటవీశాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం 23 మందిపై పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. వారిలో 18 మంది మహిళలు ఉండగా, ముగ్గురు పసిబిడ్డల తల్లులు కూడా ఉన్నారు. అదే రోజు సాయంత్రం కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు.
అయితే, ఈ చర్యపై విమర్శలు రావడంతో పోలీసులు మరుసటి రోజు హత్యాయత్నం సెక్షన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో వారికి బెయిల్ మంజూరైంది. బుధవారం జిల్లా జైలు నుంచి రైతులంతా విడుదలయ్యారు. వీరికి స్వాగతం పలికేందుకు పోడు రైతులు జిల్లా జైలుకు తరలివచ్చారు. జైలు నుంచి విడుదలైన మహిళా రైతులు తమ పిల్లలను, కుటుంబసభ్యులను చూసుకుని కన్నీటిపర్యంటమయ్యారు.
ఐదురోజులపాటు జైల్లో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు మహిళా రైతులు తెలిపారు. తమను కలిసేందుకు వచ్చిన రైతులు, న్యూమెక్రసీ నాయకుల వద్ద తాము అనుభవించిన అమానుష అనుభవం గురించి తెలిపారు. జిల్లా జైలులో తమను మహిళలని కూడా చూడకుండా జైలు సిబ్బంది కొట్టారని, మరుగుదొడ్లు కడిగించారని మహిళా రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. దుర్భాషలాడారని, బెదిరింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు, రైతులు జైలు ఎదుట ఆందోళన నిర్వహించారు. దీంతో జైలు సూపరింటెండెంట్ శ్రీధర్ వారితో మాట్లాడారు. మహిళలను కొట్టారని తేలితే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం రైతులు, నేతలు ఆందోళన విరమించారు. కాగా, జైలు నుంచి వచ్చిన మహిళలు తమ చిన్నపిల్లలను కలుసుకుని భావోద్వేగానికి గురికావడం అందరినీ కలిచివేసింది.
మరోవైపు, పోడురైతులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పెట్టిన అంశాన్ని సుమోటాగా తీసుకుంటామని, కేసులు పెట్టిన వారిని ఢిల్లీకి పిలిపిస్తామని జాతీయ బీసీ కమిషన్ వైస్చైర్మన్ లోకేష్ కుమార్, జాతీయ కమిటీ సభ్యుడు తల్లోజు ఆచారి తెలిపారు. బుధవారం జిల్లాలోని కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్ గ్రామాన్ని వారు సందర్శించారు. పోడు వివాదంలో జైలుకు వెళ్లి బెయిల్పై విడుదలై ఇళ్లకు చేరుకున్న పోడు సాగుదారులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు కమిషన్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు లోకేష్ కుమార్ ఆచారి. జైలుకు వెళ్లి వచ్చిన మహిళా రైతులు.. తమను జైల్లో ఇబ్బందులు పెట్టారని కమిషన్ సభ్యుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో తాగునీటి సమస్య ఉందని తెలపగా పది రోజుల్లో సమస్య పరిష్కారమయ్యేలా కృషి చేస్తామని చెప్పారు. కాగా, మహిళా రైతుల విషయంలో తెలంగాణ గవర్నర్ కూడా స్పందించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications