జలజగడం:అదరం బెదరం, ఎంతవరకైనా వెళ్తాం: మంత్రి పువ్వాడ అజయ్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల జగడం రోజురోజుకూ ముదురుతోంది. తెలంగాణ మంత్రులు.. ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా స్పందించారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆనాడు రాజశేఖర రెడ్డి ఆనాడు తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొడితే.. ఇవాళ ఆయన కుమారుడు కూడా అదే పని చేస్తున్నాడని ఫైరయ్యారు.

దొంగ దొంగే కదా..
కృష్ణా జలాలు దోచుకుంటున్న దొంగని దొంగ అనే అంటామని అజయ్ కుమార్ స్పష్టంచేశారు. ఏపీ సీఎం జగన్కు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుకుని తీరుతామని.. దీనిపై ఇప్పటికే కేంద్రానికి తమ అభ్యంతరం తెలియజేశామని వివరించారు. అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని.. ఇష్టం వచ్చినట్టు శ్రీశైలం దగ్గర బొక్క కొట్టి కృష్ణా జలాలు దోచుకుంటుంటే ఊరుకునే ప్రశక్తేలేదని తేల్చిచెప్పారు.

ఎంత దూరమైనా..
రాష్ట్ర రైతాంగం ప్రయోజనాల కోసం ఎంతదూరమైనా వెళ్లతామని అజయ్ స్పష్టంచేశారు. ఎవరితోనైనా కొట్లాడతామని.. తమ హక్కుల కోసం తమ వాటా కోసం అవసరమైతే దేవునితో అయినా కొట్లాడతామని కేటీఆర్ చెప్పిన విషయం మర్చిపోవద్దు అని పువ్వాడ అజయ్ కుమార్ గుర్తుచేశారు. ఖమ్మంలో అడవి మల్లేలలో 'పల్లె ప్రగతి' సభలో జలజగడంపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ కామెంట్స్ చేశారు. ఏపీ నీళ్లు తీసుకొని వెళుతుంటే.. తామేమి గాజులు తొడుక్కుని కూర్చోలేదన్నారు.

నోట్లో చక్కెర.. కడుపులో కత్తెర
ఇటు అంతకుముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైరయిన సంగతి తెలిసిందే. తెలంగాణ నీటిని దోచుకుంటుంటే వైఎస్ఆర్ను దొంగ అనక ఏమంటారు? ఇప్పుడు జగన్ కూడా అలాగే నీటిని దోచుకుపోతున్నారు అని శ్రీనివాస్ గౌడ్ ఫైరయ్యారు. నీటి గొడవ, ఇతర అంశాలపై సయోధ్యతో ఉందామనుకుంటే.. నోట్లో చక్కెర.. కడుపులో కత్తెర వైఖరితో ఏపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. తెలంగాణ నరరూప రాక్షసుడు వైఎస్ రాజశేఖర్రెడ్డి.. అని ఉద్యమంలో ఉన్నవారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన ఘనత ఆయనది అని విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications