బీజేపీకి మజ్లిస్, కేసీఆర్ మద్దతు: రాహుల్ గాంధీ నిప్పులు, మేం గెలిస్తే ఇవన్నీ ఇస్తాం
ఖమ్మం: ఇక్కడి ప్రజల ఉత్సాహం చూస్తుంటే తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి వస్తుందని ధీమా కలుగుతోందని, ఇక్కడి ఫలితాలు దేశానికి దిక్సూచి అని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ బుధవారం ఖమ్మం జిల్లా బహిరంగ సభలో అన్నారు. ఈ బహిరంగ సభలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో కలిసి వేదిక పంచుకున్నారు.
తెలంగాణ ఎన్నికలు: ఏ సర్వే ఏం చెబుతోంది, వారికి ఊహించని షాక్ తప్పదా?
కూటమి నేతలు కూడా హాజరయ్యారు. ఈ వేదికపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఏఫీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి, ప్రజా యుద్ధ నౌక గద్దర్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తదితరులు హాజరయ్యారు. ఈ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు.
కేసీఆర్ ఓవైపు, తెలంగాణ ప్రజలు మరోవైపు
కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి కాంగ్రెస్, టీఆర్ఎస్కు తేడా లేదని చెప్పారని, కానీ మోడీ ప్రభుత్వంలోని ప్రతి బిల్లుకు కేసీఆర్ ప్రభుత్వం మద్దతు ఇచ్చిందని రాహుల్ గాంధీ చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికలు, గబ్బర్ సింగ్ ట్యాక్స్ (జీఎస్టీ), అవిశ్వాస తీర్మానం.. ఇలా అన్నింటా బీజేపీకి తెరాస మద్దతు పలికిందని చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ కుటుంబం ఓవైపు, తెలంగాణ ప్రజలు మరోవైపు ఉన్నారని చెప్పారు. కేంద్రంలో ప్రధాని మోడీ వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు.
మోడీ మోసం చేస్తుంటే టీఆర్ఎస్ మద్దతు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు పలు హామీలు ఇచ్చామని రాహుల్ గాంధీ చెప్పారు. కానీ ప్రధాని మోడీ ఇటు తెలంగాణకు, అటు ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. మోడీ మోసం చేస్తుంటే, తెరాస మాత్రం ఆయనకు మద్దతిస్తోందన్నారు. కేసీఆర్ రీడిజైనింగ్ పేరుతో అంచనాలు పెంచారన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రీడిజైనింగ్ ప్రాజెక్టు కేసీఆర్ చేపట్టిన ప్రాణహిత చేవేళ్ల అన్నారు. రూ.50వేల కోట్ల అంచనాతో తాము ప్రారంభిస్తే, దానిని రూ.90వేల కోట్లకు పెంచిందన్నారు.
ఏపీకి హోదా ఇవ్వాలని విభజన చట్టంలో పెట్టాం
విభజన సమయంలో సర్ప్లస్లో ఉన్న తెలంగాణ, కేసీఆర్ పాలనలో అప్పుల ఊబిలో కూరుకుపోయిందని రాహుల్ అన్నారు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి పైన రూ.2 లక్షల అప్పు ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి తప్ప ఎవరికీ ఉద్యోగం రాలేదన్నారు. నీళ్లు, నియామకాలు, నిధుల కోసం తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన చట్టంలో పెట్టామని చెప్పారు. తెరాస, మజ్లిస్ పార్టీలు బీజేపీకి మద్దతిస్తున్నాయని చెప్పారు.
ఇవన్నీ ఇస్తాం
తాము అధికారంలోకి వస్తే 17 పంటలకు మద్దతు ధర ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. ఉద్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇస్తామని చెప్పారు. నిరుద్యోగులకు రూ.3వేల భృతి ఇస్తామన్నారు. రూ.5 లక్షలతో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపు లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అందరం ఏకమై తెరాసను ఓడిద్దామన్నారు. బీజేపీ కూటమిలోని తెరాసను ప్రజా ఫ్రంట్ ఓడిస్తుందని చెప్పారు.