పగ పెంచిన ప్రేమ.. అడ్డొస్తున్నాడని ప్రియురాలి అన్నపై కక్ష.. చివరకు..!
ఖమ్మం : అల్లారుముద్దుగా పెరిగిన చెల్లి ఓ యువకుడి ఆకర్షణలో పడటం అన్న జీర్ణించుకోలేకపోయాడు. చెల్లి జోలికి రావొద్దంటూ సదరు యువకుడికి వార్నింగ్ ఇచ్చాడు. పెద్దమనుషుల మధ్య జరిగిన పంచాయితీలో కూడా ఆ యువకుడు సరేనంటూ ఒప్పుకున్నాడు. ఆ యువతి జోలికి రానంటూ హామీ పత్రం కూడా రాసిచ్చాడు. అంతవరకు బాగానే ఉన్నా.. తమ ప్రేమకు అడ్డొచ్చాడనే ఒకే ఒక్క కారణంతో యువతి అన్నపై కక్ష పెంచుకున్నాడు. చివరకు అతడిని చంపేసేలా పగ పెంచుకున్నాడు.

పగ పెంచిన ప్రేమ
ఖమ్మం జిల్లా పాల్వంచలోని బ్రాహ్మణవీధికి చెందిన ఓ యువతిని తెలంగాణ నగర్కు చెందిన శివశంకర్ రెడ్డి అలియాస్ శివారెడ్డి ప్రేమించాడు. ఆ క్రమంలో ఆ యువతి అన్న శివారెడ్డిని బెదిరించాడు. ఒకసారి చెబితే వినకుంటే మరోసారి బెదిరించాడు. అయినా కూడా అతడిలో మార్పులేదు. దాంతో విషయం కాస్తా పంచాయితీకి దారి తీసింది. పెద్దమనుషుల సమక్షంలో జరిగిన పంచాయితీలో ఆ యువతి జోలికి రానంటూ హమీ పత్రం కూడా రాసి ఇచ్చాడు శివారెడ్డి.
అంత జరిగాక కూడా శివారెడ్డి తన వైఖరి మార్చుకోలేదు. ఆ యువతితో మళ్లీ ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నట్లు ఆమె అన్న దృష్టికి వచ్చింది. అయితే తమ ప్రేమకు ఆ యువతి అన్న అడ్డొస్తున్నాడని పగ పెంచుకున్నాడు శివారెడ్డి.

అన్న హత్యకు దారి తీసిన చెల్లి ప్రేమ
ఆ క్రమంలో గురువారం రాత్రి శివారెడ్డి దమ్మపేట సెంటర్ నుంచి వెళుతుండగా.. షకీల్తో పాటు అతడి స్నేహితుడు తారసపడ్డారు. అప్పటికే షకీల్పై పగ పెంచుకున్న శివారెడ్డి వారిద్దరిని నానా మాటలంటూ ఇష్టమొచ్చినట్లు తిట్టాడు. అయితే అది తట్టుకోలేకపోయిన షకీల్ అదే రోజు రాత్రి తన స్నేహితుడితో కలిసి శివారెడ్డి ఇంటికి వెళ్లి నిలదీద్దామనుకున్నాడు. ఆ నేపథ్యంలో శివారెడ్డి, షకీల్ మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారి తీసింది.
ప్రేమకు అడ్డొస్తున్నాడని ఎప్పటినుంచో షకీల్పై కక్ష పెంచుకున్న శివారెడ్డి ఇదే అదనుగా భావించాడు. వరుసకు సోదరుడయ్యే మహేందర్ రెడ్డి సాయంతో షకీల్పై కత్తితో దాడి చేశాడు. దాంతో రక్తస్రావం కావడంతో షకీల్ పరుగులు పెట్టాడు. అతడి స్నేహితుడేమో స్థానికులను నిద్రలేపే క్రమంలో వేరే దిక్కుకు పరుగెట్టాడు. షకీల్ ఒక్కడే ఉండటంతో వెంటాడి మరీ చంపారు. దాంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

నిందితులు అరెస్ట్
ప్రేమకు అడ్డొస్తున్నాడని పగ పెంచుకుని షకీల్ను చంపడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. చేతికి అందొచ్చిన కొడుకు ఇలా అర్ధాంతరంగా చనిపోవడంతో తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అయితే షకీల్ తండ్రి గౌస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం దమ్మపేట సెంటర్ దగ్గర నిందితులు శివారెడ్డి, మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications