కుప్పం గడ్డమీదకు సీఎం జగన్ - చంద్రబాబుకు ఆహ్వానం : ఉత్కంఠ..!!
ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం మరోసారి అధికారం. అందులో తొలి టార్గెట్ చంద్రబాబుకు సొంత నియోజకవర్గం కుప్పం. ఈ సారి 175 సీట్లలో గెలవాలంటూ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా.. సీఎం హోదాలో తొలి సారి కుప్పం కు వెళ్తున్న జగన్ పర్యటన పైన ఆసక్తి - ఉత్కంఠ మొదలైంది. ఈ నెల 22న ముఖ్యమంత్రి జగన్ కుప్పం పర్యటనకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ సారి కుప్పంలో ఎలాగైనా వైసీపీ జెంగా ఎగురవేయాలనే లక్ష్యంతో ఉన్నారు.
కుప్పంపై సీఎం జగన్ ఫోకస్
కొద్ది నెలల క్రితం జరిగిన స్థానిక సంస్థలు..మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. అప్పటి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలనే పట్టుదల వైసీపీలో పెరిగింది. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ప్రతీ ఆరు నెలలకు ఒక సారి పర్యటన చేస్తున్నారు. తాజాగా జరిగిన పర్యటన సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పులివెందులలో జగన్ ను ఓడిస్తానంటూ చంద్రబాబు సవాల్ చేసారు. అదే సమయంలో కుప్పంలో ముందు గెలవాలంటూ వైసీపీ నేతలు చంద్రబాబుకు సవాల్ చేస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి కుప్పం బాధ్యతలను భుజాన వేసుకున్నారు. కుప్పం ను రెవిన్యూ డివిజన్ గా మార్చాలని చంద్రబాబు అభ్యర్ధనతో ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.
పార్టీ నేతలకు దిశా నిర్దేశం
తాజాగా.. నియోజకవర్గాల సమీక్షలో భాగంగా కుప్పం వైసీపీ ఇంఛార్జ్ గా ఉన్న ఎమ్మెల్సీ భరత్ ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. అదే విధంగా కుప్పం మున్సిపాల్టీలో అభివృద్ధి పనుల కోసం రూ 66 కోట్లు కేటాయించారు. ఈ నెల 22న ఆ 66 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి పాల్గొనే అధికారిక పర్యటనలో ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబుకు సమాచారం ఇవ్వనున్నారు. సీఎం పాల్గొనే కార్యక్రమాలకు చంద్రబాబు హాజరయ్యే అవకాశం దాదాపు ఉండదు.
సీఎం పర్యటనపై రాజకీయ ఉత్కంఠ
అయితే, ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తరువాత తొలి సారి కుప్పంకు వస్తున్న జగన్ కు ఘన స్వాగతం పలికేందుకు.. బహిరంగ సభ కు భారీగా జన సమీకరణ చేసేందుకు స్థానిక నేతలు కసరత్తు ప్రారంభించారు. కుప్పం లో ఈ సారి గెలుపు పైన సీఎం జగన్ స్వయంగా ఫోకస్ పెట్టటంతో పార్టీ యంత్రాంగం అప్రమత్తమైంది. అదే విధంగా వైసీపీని ఎదుర్కోవటానికి టీడీపీ శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి. దీంతో...ఇప్పుడు ముఖ్యమంత్రి కుప్పం పర్యటనకు వస్తుండటంతో రాజకీయంగా ఉత్కంఠ కనిపిస్తోంది. కుప్పం వేదికగా ముఖ్యమంత్రి జగన్ ఎటువంటి ప్రకటన చేయబోతున్నారు.. కుప్పం కు ఎటువంటి వరాలు ఇచ్చే అవకావం ఉందంటూ చర్చ మొదలైంది.