కుప్పంలో ఏం జరుగుతోంది - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!!
టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గాల సమీక్షలను వేగవంతం చేసారు. ఇప్పటి వరకు మొత్తంగా 111 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని చంద్రబాబు స్వయంగా ఇంఛార్జ్ లతో సమీక్షలు నిర్వహించారు. సర్వే నివేదికలతో పాటుగా తాను వివిధ మార్గాల్లో సేకరించిన సమాచారం ఆధారంగా పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి వచ్చే ఎన్నికల్లో సీట్లు ఖాయమని ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు.. యువతకు 50 శాతం సీట్లు కేటాయిస్తామని చెప్పుకొచ్చారు. దీంతో, పార్టీ సీనియర్లు కొందరు తమ వారసులను రంగంలోకి దించేందుకు సిద్దమవుతున్నారు.
ఇక, నియోజకవర్గాల్లో సమీక్షల్లో భాగంగా కుప్పం లో పరిస్థితుల పైన స్థానిక నాయకులతో చంద్రబాబు సమీక్షించారు. ప్రతీ సమీక్షలో నియోజకవర్గాల ఇంఛార్జ్ లతో సమీక్ష చేస్తున్న చంద్రబాబు..కుప్పంలో తానే అభ్యర్ధిగా బరిలో నిలుస్తుండటంతో పార్టీ నేతలను సమీక్షకు ఆహ్వానించారు. తొలి నుంచి కుప్పాన్ని మోడల్ నియోజకవర్గంగా చేశామని, హింస, విద్వేష రాజకీయాలను కుప్పం ప్రజలు అనుమతించరని చెప్పారు. కుప్పం లో ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడిస్తామంటూ వైసీపీ నేతలు పదే పదే చెబుతున్న సమయంలో ఈ సమీక్ష కీలకంగా మారింది.
ముఖ్యమంత్రి జగన్ సైతం ప్రతీ పార్టీ మీటింగ్ లో కుప్పంలో మనమే గెలుస్తున్నామంటూ చెబుతున్నారు. కుప్పంలో పార్టీ నేతలు ఎవరూ భేషజాలకు పోవద్దని, గ్రామస్థాయి వరకు అందరినీ కలుపుకుని వెళ్లాలని చంద్రబాబు స్పష్టం చేసారు. కుప్పంలో ప్రజలు అభిమానంతో తనను గెలిపిస్తూ వస్తున్నారని, పులివెందుల మాదిరిగా భయపెట్టి ఓట్లు వేయించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. అధికారులను ఉపయోగించుకుని అరాచకాలు చేస్తున్న వైసిపి నేతల లెక్కలు సరిచేస్తానని హెచ్చరించారు. నియోజకవర్గాల్లో పరిణామాలను నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యక్తిత్వం తెలియాలంటే కుప్పంలో రాష్ట్రప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని కేస్ స్టడీగా తీసుకోవచ్చునని చంద్రబాబు విమర్శించారు.
తాను ఇక కుప్పం తరచూ వస్తానని చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టం చేుసారు. ఒకే సింబల్ పైన అన్ని ఎన్నికల్లోనూ గెలిచిన నియోకవర్గాలు కుప్పం..హిందూపురం మాత్రమేనని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇచ్ఛాపురం..కర్నూలు నియోకవర్గల ఇంఛార్జ్ లతోనూ చంద్రబాబు సమీక్షలు చేసారు. సాధ్యమైనంత త్వరగా నియోజకవర్గాల సమీక్షలు పూర్తి చేసి.. జిల్లాల పర్యటనలకు చంద్రబాబు సిద్దం అవుతున్నారు.