చంద్రబాబు మార్క్ డెసిషన్ - కుప్పం నుంచే "సై"..!
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు పూనుకున్నారు. మూడు రోజుల పాటు ఆయన సొంత నియోజకవర్గాన్ని సందర్శించనున్నారు. నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాలకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా కుప్పానికి వెళ్లనున్నారాయన.

కందుకూరులో..
ఇదివరకు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ఆందోళనను నెల్లూరు జిల్లాలో నిర్వహించిన విషయం తెలిసిందే. జిల్లాలోని కందుకూరులో డిసెంబర్ 28వ తేదీన చేపట్టిన రోడ్ షోలో సంభవించిన తొక్కిసలాటలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు నష్ట పరిహారాన్ని చెల్లించిన అనంతరం మళ్లీ తన ఆందోళనను కొనసాగించారు. కావలి, ఉదయగిరిల్లో పర్యటించారు.

గుంటూరు సభలో కూడా..
అటు గుంటూరులో జరిపిన చంద్రబాబు సభలో కూడా అపశృతి చోటు చేసుకుంది. చంద్రన్న కానుక పంపిణీ సందర్భంగా చేపట్టిన బహిరంగ సభలో సంభవించిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళల దుర్మరణం పాలయ్యారు. ఈ రెండు ఉదంతాల తరువాత రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలను తీసుకుంది. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధించింది. ఈ మేరకు సోమవారం రాత్రి కీలక ఉత్తర్వులను జారీ చేసింది హోం శాఖ. ఖచ్చితమైన మార్గదర్శకాలను జారీ చేసింది.

కుప్పం పర్యటన ఎలా..
ఈ పరిణామాల మధ్య చంద్రబాబు- కుప్పం పర్యటనకు వెళ్లబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన పర్యటనలో ఎక్కువగా రోడ్ షోలే ఉంటాయనేది ఇదివరకు వేర్వేరు సందర్భాల్లో జరిగిన పర్యటనల్లో స్పష్టమైంది. రోడ్ల మీదే బహిరంగ సభలను నిర్వహిస్తుంటారు. ఆ ఆందోళన కార్యక్రమాలను డ్రోన్లతో షూట్ చేయడానికి చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. తాజాగా వాటిని నిషేధించిన నేపథ్యంలో చంద్రబాబు టూర్ ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది.

రచ్చబండపైనా..
రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధించిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు రూటు మార్చొచ్చని తెలుస్తోంది. తన రోడ్ షో, బహిరంగ సభలను రచ్చబండగా మార్చుతారని సమాచారం. స్థానిక ప్రజలతో నేరుగా ముఖాముఖిగా భేటీ కావడానికి ప్రాధాన్యత ఇస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో మండల స్థాయి నాయకులతో అక్కడికక్కడే పార్టీ స్థితిగతులపై సమీక్ష సమావేశాలను నిర్వహిస్తారని సమాచారం.

షెడ్యూల్ ఇదే..
బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శాంతిపురం మండలం పెద్దూరుకు వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ఆందోళన ప్రారంభమౌతుంది. మండల పరిధిలోని గ్రామాల్లో పర్యటిస్తారు. అనంతరం శాంతిపురం మండలంలో సాయంత్రం 7 గంటలకు బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. తాజాగా రోడ్లపై బహిరంగ సభలను నిషేధించిన నేపథ్యంలో- దీన్ని రచ్చబండగా మారుస్తారని తెలుస్తోంది.

కుప్పంలో బస..
రాత్రికి ఆయన కుప్పంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. ఎల్లుండి అక్కడే స్థానికులను కలుసుకుంటారు. వారి నుంచి వినతిపత్రాలను స్వీకరిస్తారు. పార్టీ నాయకులతో సమీక్ష సమావేశాల్లో పాల్గొంటారు. 6వ తేదీన మళ్లీ గుడుపల్లెకు చేరుకుంటారు. రైల్వేస్టేషన్ జంక్షన్ లో బహిరంగ సభను నిర్వహిస్తారు. పెద్దగొల్లపల్లి, చిన్నగొల్లపల్లి, పెద్దపర్తికుంట, మాలవానికుంట.. గ్రామాల్లో పర్యటిస్తారు. సాయంత్రం బెంగళూరు మీదుగా హైదరాబాద్ కు బయలుదేరి వెళ్తారు.












Click it and Unblock the Notifications