న్యాయ రాజధానికి వైఎస్ జగన్: హైకోర్టుకు స్థలం కేటాయించిన తరువాత తొలిసారిగా: ఎయిర్పోర్ట్
కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ నెల 26వ తేదీన కర్నూలుకు వెళ్లనున్నారు. జగన్నాథ గట్టు వద్ద 250 ఎకరాల విస్తీర్ణంలో ఏపీ హైకోర్టు, న్యాయ రాజధానిని నిర్మిస్తామనే ప్రకటన వెలువడిన తరువాత ఆయన కర్నూలుకు వెళ్లనుండటం ఇదే తొలిసారి. ఇదివరకు పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి హఠాన్మరణం అనంతరం ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి కర్నూలు జిల్లాకు వెళ్లారు. తాజాగా మరోసారి ఆ జిల్లా గడప తొక్కనున్నారు.
ఒక్కరోజు తేడాతో తిరుమలకు వైఎస్ జగన్.. చంద్రబాబు: సపరివార సమేతంగా టీడీపీ చీఫ్..కారణం?
తన పర్యటన సందర్భంగా ఓర్వకల్ ఎయిర్పోర్టులో విమాన సర్వీసులను ఆయన లాంఛనంగా ప్రారంభించనున్నారు. 28వ తేదీ నుంచి విమాన సర్వీసులు ఈ ఎయిర్ పోర్ట్ నుంచి అందుబాటులోకి రానున్నాయి. తొలిదశలో బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, విజయవాడలకు ఈ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. క్రమంగా ప్రయాణికుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా ఎంపికక చేసిన ప్రధాన నగరాలకు విమానాల సర్వీసులను పెంచుతారు.
కర్నూలు-విశాఖపట్నం, కర్నూలు-చెన్నై, కర్నూలు-బెంగళూరులను రద్దీ మార్గాలుగా గుర్తించారు ఏపీ ఎయిర్పోర్ట్ అభివృద్ధి సంస్థ అధికారులు. తొలిదశలో ఈ మార్గాల్లోనే విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. దీనికి అవసరమైన బుకింగులు శుక్రవారం నుంచే ప్రారంభం అయ్యాయి. ఉడాన్ పథకంలో భాగంగా- ద్వితీయ శ్రేణి నగరాలకూ విమాన సర్వీసులను విస్తరించింది కేంద్ర ప్రభుత్వం. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే.. విశాఖ, విజయవాడ, తిరుపతి, కడప నగరాల సరసన కర్నూలు చేరుతుంది.
తన పర్యటన సందర్భంగా ఆయన జిల్లా అధికారులు, పార్టీ నేతలతో న్యాయ రాజధాని అంశంపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. జగన్నాథ గట్టు ప్రాంతాన్ని కూడా సందర్శిస్తారనే ప్రచారం జిల్లాలో సాగుతోంది. దీన్ని ఇంకా ఖరారు చేయలేదు. జగన్నాథ గట్టు వద్ద 250 ఎకరాల్లో హైకోర్టు నిర్మాణం, జ్యుడీషియల్ టౌన్షిప్కు శంకుస్థాపన ఎప్పుడు చేయాల్సి ఉందనే విషయంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. శంకుస్థాపన చేసిన తేదీ నుంచి రెండేళ్ల లోపలే నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని అంటున్నారు.
Recommended Video