కర్నూలు జిల్లాలో ఘోరం: 14 మంది అక్కడికక్కడే దుర్మరణం
కర్నూలు: విశాఖపట్నం జిల్లా అనంతగిరి సమీపంలో చోటు చేసుకున్న దుర్ఘటనను విస్మరించకముందే- కర్నూలు జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే మరణించారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులందరూ చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఫలితంగా- మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టమ్ కోసం తరలించారు.
ఆదివారం తెల్లవారు జామున కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి మండలం జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన నాలుగు కుటుంబాలకు చెందిన వారు రాజస్థాన్లోని అజ్మీర్లో గల హజ్రత్ ఖ్వాజా గరీబ్ నవాజ్ దర్గాను సందర్శించడానికి శనివారం రాత్రి ఓ టెంపోలో బయలుదేరారు. మార్గమధ్యలో ఈ టెంపో.. ప్రమాదానికి గురైంది. కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి మండలం మాదాపురం వద్దకు రాగానే లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో 14 మంది సంఘటనా స్థలంలోనే మరణించారు. వారిలో ఎనిమిది మంది మహిళలు.. ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పలువురు గాయపడ్డారు.

లారీ ఢీ కొట్టిన వేగానికి టెంపో ఎగిరిపడింది. పల్టీలు కొట్టింది. 14 మంది సంఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డారంటే.. ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. సంఘటనా స్థలం రక్తసిక్తమైంది. సమాచారం అందుకున్న వెంటనే వెల్దుర్తి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 104, 108 అంబులెన్సుల ద్వారా గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న వారిని మెరుగైన చికిత్స కోసం కర్నూలు జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో మదనపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి.












Click it and Unblock the Notifications