కరోనా ముక్త భారత్ కోసం: వ్యాక్సిన్ తీసుకున్న సోము వీర్రాజు: కర్నూలులో
కర్నూలు: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ రెండోదశ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఈ దశలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలు వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను పోగొడుతున్నారు. 60 ఏళ్లకు పైనున్న వయస్సు గల వృద్ధులు, 45 సంవత్సరాల వయస్సున్న దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతోన్న వారు.. కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి అర్హులు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా.. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒక్కో డోసుకు 250 రూపాయలకు టీకాలను వేస్తోన్నారు.
రాష్ట్రంలోనూ పలువురు రాజకీయ నాయకులు, అర్హులైన వారు వ్యాక్సిన్ వేయించుకుంటోన్నారు. తాజాగా- భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు.. కర్నూలులో కరోనా టీకా వేయించుకున్నారు. వీఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆయనకు కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఇఛ్చారు డాక్టర్లు. ఇది దేశీయ వ్యాక్సిన్. హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ప్రధాని సైతం ఈ వ్యాక్సినే తీసుకున్నారు.
ప్రస్తుతం సోము వీర్రాజు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా- కర్నూలుకు వచ్చారు. అనంతరం వీఆర్ ఆసుపత్రిలో వ్యాక్సిన్ తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ను తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. టీకా తీసుకున్న అనంతరం తనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని చెప్పారు. వ్యాక్సిన్ పనితీరును ఎలాంటి భయాందోళనలను పెట్టుకోవాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, కరోనా ముక్త భారత్కు నడుం బిగించాలని సూచించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా వ్యాక్సిన్ తీసుకున్నారని గుర్తు చేశారు. అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు, డాక్టర్లకు సోము వీర్రాజు కృతజ్ఙతలు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాల వల్లే ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి దేశీయంగా వ్యాక్సిన్ను కనిపెట్టే అవకాశం లభించిందని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్కు ఇది నిదర్శనమని చెప్పారు.