అరికెర రథోత్సవంలో అపశ్రుతి: విద్యత్ షాక్ తో ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు
కర్నూలు: జిల్లాలోని ఆలూరు మండలం అరికెర గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కనులవిందుగా జరుగుతున్న పాండురంగ రథోత్సవంలో అపశృుతి చోటు చేసుకుంది. విద్యుత్ ఘాతంతో ఇద్దరు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మహా శివరాత్రిని పురస్కరించుకుని గ్రామంలో కొలువైన పాండురంగ స్వామికి శుక్రవారం రథోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవంలో గ్రామ ప్రజలంతా పాల్గొని రథాన్ని లాగుతున్నారు. ఇదే సమయంలో పైనున్న హై-టెన్షన్ తీగల ఎర్తింగ్ తగిలడంతో విద్యుత్ షాక్ కొట్టింది.
ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందించారు. కాగా, మృతి చెందినవారిని శివ(25), లక్ష్మన్న(28)గా గుర్తించారు. ఎంతో వేడుకగా జరుగుతున్న రథోత్సవంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ ప్రమాద ఘటనపై మంత్రి జయరాం స్పందించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. ఆలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు, మృతుల కుటుంబాలను మంత్రి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా మరింత సాయం అందేలా చూస్తామన్నారు.