ఏపీలో స్కూల్స్ రీఓపెన్: తొలి రోజే విద్యా కానుక కిట్స్: ఆదోనికి వైఎస్ జగన్
కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాళ కర్నూలు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ ఉదయం ఆయన తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు ఎయిర్పోర్ట్కు వస్తారు. అనంతరం హెలికాప్టర్లో ఆదోనికి చేరుకుంటారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోన్న జగనన్న విద్యా కానుక కిట్లను ఆయన పంపిణీ చేస్తారు.
దీనికోసం బహిరంగ సభను నిర్వహించనుంది ప్రభుత్వం. మున్సిపల్ హైస్కూల్లో ఈ సభ ఏర్పాటైంది. సభ నిర్వహణ ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. కర్నూలు జిల్లా కలెక్టర్ పీ కోటేశ్వర రావు, పోలీస్ సూపరింటెండెంట్ సిద్ధార్థ్ కౌశల్ అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పాఠశాలలు పునఃప్రారంభం కానున్న తొలి రోజే ప్రభుత్వం.. విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేయనుంది. ఈ పథకం ప్రారంభించిన తరువాత.. దీన్ని అమలు చేయడం వరుసగా ఇది మూడో సంవత్సరం.

ప్రతి విద్యార్ధికి ఉచితంగా మూడు జతల యూనిఫాం క్లాత్, దానికి అవసరమైన కుట్టుకూలి మొత్తం, ఒక జతల బూట్లు, రెండు జతల సాక్స్, బెల్టు, స్కూల్ బ్యాగు, టెక్ట్స్బుక్స్, నోట్ బుక్స్, వర్క్బుక్స్, ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీ ఈ కిట్స్లో ఉంటాయి. ఇవ్వాళ్టి నుంచి నాలుగైదు రోజుల్లోగా అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేయాల్సి ఉంటుందంటూ ఇప్పటికే విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాలను జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 47,40,421 మంది విద్యార్థినీ, విద్యార్థులకు ఈ కిట్స్ అందుతాయి. దీనికోసం ఈ విద్యా సంవత్సరానికి ప్రభుత్వం 931 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. జగనన్న విద్యా కానుక పథకంపై ఇప్పటివరకు 2,368 కోట్ల రూపాయలను వ్యయం చేసింది ప్రభుత్వం. నాడు-నేడు, గోరుముద్ద వంటి పథకాలను కూడా కలుపుకొంటే ఈ మూడు సంవత్సరాల్లో విద్యారంగంపై ప్రభుత్వం చేసిన ఖర్చు 52,676 కోట్ల రూపాయలు.












Click it and Unblock the Notifications