అవసరమైతే రాజీనామాకు సిద్దం: వైసీపీ ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి: అసలు డిమాండ్ ఇదే..!
ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యే అల్టిమేటం జారి చేసారు. పౌరసత్వ బిల్లుకు వైసీపీ పార్లమెంట్ లో మద్దతివ్వటం పైన బహిరంగంగానే వ్యతిరేకించారు. దేశంలోని ముస్లింలపై వివక్ష చూపేలా కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలకు తమ పార్టీ మద్దతివ్వడాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి తప్పు బట్టారు. వైసీపీ ఎంపీలు సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలకు మద్దతివ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. చట్టం అమల్లో భాగంగా ముస్లింలకు ఇబ్బందులు తలపెడితే సహించేది లేదన్నారు. అవసరమైతే రాజీనామా చేసేందుకూ వెనుకాడనని స్పష్టం చేశారు. ఆయన ఇప్పటికే ఇదే అంశం పైన ముఖ్యమంత్రి జగన్ ను సైతం కలిసారని తెలుస్తోంది. అయితే, ఆ చట్టాలతో ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లదని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే, ఇప్పుడు చక్రపాణిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో హట్ టాపిక్ గా మారాయి.
చక్రపాణిరెడ్డి హాట్ కామెంట్స్...
కర్నూలు రాజకీయాల్లో శిల్పా చక్రపాణిరెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. భూమా కుటుంబం వైసీపీ నుండి టీడీపీలో చేరగానే..శిల్పా సోదరులు టీడీపీ వీడి వైసీపీలో చేరారు. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో వైసీపీ నుండి శిల్పా మోహన రెడ్డి పోటీ చేసారు. ఆ సమయంలోనే శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే, వైసీపీలో చేరాలంటే ముందుగా టీడీపీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల ని జగన్ కండీషన్ పెట్టారు. దీంతో..నంద్యాలలో జగన్ పాల్గొన్న సభలో చక్రపాణి రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసారు. ఇక, నంద్యాల ఎన్నికలు పూర్తి కాగానే స్థానికంగా టీడీపీ నేత చక్రపాణి రెడ్డి మీద దాడికి ప్రయత్నించారు. గన్ మెన్ కాల్పులకు దిగారు. అప్పట్లో అది సంచలనంగా మారింది. ఇక, వైసీపీలోనే కొనసాగతున్న చక్రపాణిరెడ్డి 2019 ఎన్నికల్లో నంద్యాల నుండి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసారు. ఎన్నికల్లో గెలిచారు. ఇక, ఇప్పుడు తాజాగా ఆయన పౌరసత్వ బిల్లు విషయంలో చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారాయి.

పార్లమెంట్ లో మద్దతిచ్చిన వైసీపీ..
పౌరసత్వ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభల్లో వైసీపీ మద్దతిచ్చింది. అయితే, ఈ బిల్లు ఆమోదం పొందిన తువాత ఎన్నార్సీ పైన దేశ వ్యప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఇక, ఏపీలో ఎన్నార్సీ అమలు చేయ మని ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా స్పష్టం చేసారు. కడప పర్యటనలో ముఖ్యమంత్రి సైతం ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు. ఏపీలో ఎన్నార్సీ అమలు చేయమని ప్రకటించారు. ఇక, కేంద్రం సైతం దీని స్థానం ఎన్పీఆర్ అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి ఇదే అంశం పైన వ్యాఖ్యలు చేయటం.. ప్రభుత్వ అమలు చేయమని చెప్పిన తరువాత అవసరమైతే తాను రాజీనామా చేస్తానని వ్యాఖ్యానించటం పైన వైసీపీలో చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications