ఏపీలో పొత్తుల డైలమా- నేరుగా రంగంలోకి దిగిన అమిత్ షా- చంద్రబాబు అలర్ట్..!!
విశాఖపట్నం: భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ ఇక భారీ సభలు, రోడ్ షోలకు శ్రీకారం చుట్టింది. ఇంకో ఏడాదిన్నరలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో గ్రామస్థాయిలో పర్యటనలకు దిగబోతోంది. రాష్ట్రంలో 13 వేల గ్రామాల్లో పాదయాత్రలను చేపట్టనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారలో ఉన్న సొంత పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలను గ్రామస్థాయిలో ప్రజలకు చేరవేసేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది.
8న అమిత్ షా సభలు..
జనవరి 26వ తేదీ తరువాత పాదయాత్రలను మొదలు పెట్టనుంది బీజేపీ. దీనికి సన్నాహకంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో రెండు బహిరంగ సభలను నిర్వహించేలా ప్లాన్ చేసింది. ఈ రెండు కూడా రాయలసీమ జిల్లాల్లో ఏర్పాటు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇందులో ఒకటి కర్నూలులో.. మరొకటి హిందూపురంలో నిర్వహించనుంది. ఈ రెండూ జనవరి 8వ తేదీ నాడే షెడ్యూల్ చేసింది.
సీమపై ప్రభావం..
కర్నూలు, హిందూపురం పార్లమెంటరీ జిల్లాల్లో అమిత్ షా సుడిగాలి పర్యటనలను జరిపేలా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేస్తోన్నారు ఏపీ బీజేపీ నాయకులు. అమిత్ షా బహిరంగ సభల ప్రభావం నాలుగు జిల్లాలపై ఉంటుందని, ఇది ఓటుబ్యాంకును ప్రభావితం చేస్తుందనే అంచనాలు బీజేపీ రాష్ట్రశాఖ నాయకుల్లో వ్యక్తమౌతోన్నాయి. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడానికి అమిత్ షా బహిరంగ సభలు దోహదపడతాయనే అంచనాలు ఉన్నాయి.
తేలని పొత్తుల వ్యవహారం..
ప్రస్తుతానికి బీజేపీ-జనసేన పార్టీ మధ్య పొత్తు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అటు తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి తనవంతు ప్రయత్నాలు మొదటి నుంచీ సాగిస్తూ వస్తోంది గానీ- బీజేపీ జాతీయ స్థాయి నాయకులు కనికరించట్లేదు.. చంద్రబాబు పట్ల సానుకూల వైఖరిని కనపర్చట్లేదు. జనసేనతో పొత్తును కొనసాగించడానికే మొగ్గు చూపుతున్నామనే విషయాన్ని రాష్ట్ర నాయకులు పలు సందర్భాల్లో స్పష్టంచేశారు కూడా.
అమిత్ షా వద్దకు టీడీపీ టీమ్..
ఈ పరిణామాల మధ్య ఇక అమిత్ షా రంగంలోకి దిగబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమిత్ షా రానున్న నేపథ్యంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అలర్ట్ అయ్యారు. ఆయన వద్దకు ప్రత్యేకంగా పార్టీ నాయకులతో కూడిన బృందాన్ని పంపించే అవకాశాలు లేకపోలేదు.
జగన్ పై ఫిర్యాదు..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటోందని ఆరోపిస్తూ వస్తోంది టీడీపీ. తమ పార్టీ నాయకులపై దాడులు జరుగుతున్నాయనీ ఆరోపిస్తోంది. ఇదే విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లడానికి అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు.. ఇతర నాయకులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేయొచ్చనే ప్రచారం అప్పుడే ఊపందుకుంది. జగన్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడంతో పాటు పొత్తుల అంశంపై మాట్లాడొచ్చని తెలుస్తోంది.