వికేంద్రీకరణ కోసం మరో బహిరంగ సభ..!!
కర్నూలు: దేశ అత్యున్నత న్యాయస్థానం తాజాగా ఇచ్చిన స్టే ఆదేశాలతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపింది. మూడు రాజధానులను ఏర్పాటు చేయడంలో ఇప్పటివరకు ఉన్న న్యాయపరమైన చిక్కులు, ఇతర ఇబ్బందులు ఒక్కటొక్కటిగా తొలగిపోతున్నట్టే భావిస్తోంది. ఈ క్రమంలో అధికారాన్ని వికేంద్రీకరించే దిశగా తక్షణ చర్యలను తీసుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగంగా మూడు రాజధానులకు అవసరమైన కొత్త బిల్లు రూపకల్పనపై కసరత్తు మరింత ముమ్మరం చేసింది.

మూడు రాజధానుల్లో..
రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాల్సి ఉంటుందని, ఆరు నెలల్లోగా దీని నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుందంటూ గతంలో ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తదుపరి విచారణను జనవరి 31వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఇక మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో జాప్యం చేయకూడదనే నిర్ణయానికి వచ్చింది వైఎస్ఆర్సీపీ.

ఏప్రిల్లో విశాఖ నుంచి..
ఉగాది నాటికి విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా బదలాయించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ విషయాన్ని మంత్రులు కూడా ధృవీకరించారు. వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తారంటూ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. ఏప్రిల్ నాటికి సచివాలయం విశాఖపట్నానికి తరలి వెళ్తుందని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంకేతాలు ఇచ్చారు.

బహిరంగ సభ కోసం..
ఈ క్రమంలో- ఇక కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయించే ప్రక్రియ కూడా ఊపందుకోనుంది. కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయించడం, అధికార వికేంద్రీకరణకు నాన్ పొలిటికల్ జేఏసీ మద్దతు పలికింది. ఇందులో భాగంగా న్యాయ రాజధానిగా ప్రతిపాదించిన కర్నూలులో భారీ బహిరంగ సభను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 5వ తేదీన ఈ సభను నిర్వహించనున్నట్లు నాన్ పొలిటికల్ జేఏసీ తెలిపింది.

విశాఖను మించేలా..
రాయలసీమ ప్రాంతానికి చెందిన అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించాలని భావిస్తోంది. లక్షమంది వరకు ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేస్తోన్నారు నాన్ పొలిటికల్ జేఏసీ ప్రతినిధులు. గతంలో విశాఖపట్నంలో నిర్వహించిన బహిరంగ సభను తలదన్నేలా దీన్ని ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు.

వైసీపీ మద్దతు..
ఈ సభకు వైఎస్ఆర్సీపీ మద్దతు ప్రకటించింది. రాయలసీమకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. తమ ప్రభుత్వమే అధికార వికేంద్రీకరణను ప్రతిపాదించిన నేపథ్యంలో- వారి భాగస్వామ్యం తప్పనిసరిగా ఉంటుందనేది తెలిసిన విషయమే. ఇదివరకు నాన్ పొలిటికల్ జేఏసీ- విశాఖపట్నంలో నిర్వహించిన సభను కూడా వైసీపీ నాయకులు విజయవంతం చేశారు. అదే తరహాల కర్నూలులో నిర్వహించ తలపెట్టిన సభకూ వైసీపీ నాయకులు అండగా ఉండనున్నారు.












Click it and Unblock the Notifications