వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్పై.. ఉత్కంఠత
కర్నూలు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్పై ఉత్కంఠత నెలకొంది. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్- ఇవ్వాళ ఈ పిటీషన్పై విచారణ చేపట్టనుంది. తల్లి అనారోగ్యం కారణంగా అవినాష్ రెడ్డి ప్రస్తుతం కర్నూలులో ఉంటోన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాష్ రెడ్డి ఇప్పటికే ఏడుసార్లు సీబీఐ అధికారుల విచారణకు హాజరయ్యారు. ఈ నెల 22వ తేదీన మరో దఫా విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ- తల్లి లక్ష్మమ్మ అనారోగ్యానికి గురి కావడంతో గడువు కోరారు. కర్నూలులోని విశ్వభారతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆయన తల్లి చికిత్స తీసుకుంటోన్నారు. ప్రస్తుతం అవినాష్ రెడ్డి అక్కడే ఉంటోన్నారు.

గతంలో విచారణకు హాజరైనప్పుడే తాను అన్ని విషయాలను సీబీఐ అధికారులకు తెలియజేశానని అవినాష్ రెడ్డి పదే పదే చెబుతూ వస్తోన్న విషయం తెలిసిందే. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో తన వద్ద ఉన్న సమాచారం మొత్తాన్నీ వారికి వివరించానని, ఇందులో దాచిపెట్టాల్సిన అంశాలేవీ లేవని పేర్కొంటోన్నారాయన. అనారోగ్యానికి గురైన తల్లిని బాగోగులను చూసుకుంటోన్న పరిస్థితుల్లో ఆయన విచారణకు హాజరు కాలేననీ సీబీఐ అధికారులకు వివరించారు.
విచారణలో భాగంగా సీబీఐ అధికారులు కర్నూలు కూడా చేరుకున్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటీషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆమె కోలుకునేంత వరకు తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ సీబీఐ అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. గతంలోనూ తాను ఏడుసార్లు సీబీఐ అధికారుల విచారణకు హాజరయ్యానని, వారికి పూర్తిగా సహకరించానని గుర్తు చేశారు.
విచారణ సందర్భంగా జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు వెకేషన్ బెంచ్కు వెళ్లాలని సూచించింది. ఈ నెల 25న విచారించాలంటూ పేర్కొంది సుప్రీంకోర్టు. దీనితో ముందస్తు బెయిల్ పిటీషన్ నేడు- తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందుకు రానుంది. ఈ ముందస్తు బెయిల్ పిటీషన్పై ఎలాంటి ఆదేశాలు వెలువడుతాయనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.












Click it and Unblock the Notifications