విషాదం: కరోనా పాజిటివ్ అని తెలిసి షాక్.. నిమిషాల్లోనే మహిళ ప్రాణం వదిలింది
మెదక్: తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని పోతరాజుపల్లిలో విషాదం నెలకొంది. కరోనా పాజిటివ్ అని తేలగానే తీవ్ర ఆందోళనకు గురైన ఓ మహిళ కరోనా నిర్ధారణ కేంద్రం వద్దే ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన మెదక్ జిల్లాలోని తూప్రాన్లోని కరోనా పరీక్ష కేంద్ర వద్ద చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. పోతురాజుపల్లికి చెందిన పల్లపు శ్యామల(30) గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెను చికిత్స నిమిత్తం కుటుంబసభ్యలు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కరోనా అనుమానంతో గురువారం ఆమెకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.
ఈ క్రమంలో శ్యామలకు కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురైన ఆమె నిమిషాల వ్యవధిలోనే పరీక్షా కేంద్రం వద్దే ప్రాణాలు కోల్పోయింది. కరోనా నిబంధనల ప్రకారం పోతురాజుపల్లి మున్సిపాలిటీ పరిధిలో శ్యామలకు అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, శ్యామలకు మూడేళ్ల క్రితం వివాహమైంది. అయితే, భర్త నుంచి విడాకులు తీసుకుని తల్లి వద్దే ఉంటోంది.
ఇది ఇలావుండగా, తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే, గత రెండు మూడు రోజులతో పోలిస్తే బుధవారం కొత్త కరోనా కేసులు కొంతమేర తగ్గాయి. అదే సమయంలో మరణాలు మాత్రం పెరిగాయి. రాష్ట్రంలో బుధవారం 80.181 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 7994 మందికి కరోనా సోకినట్లు తేలింది.
తాజాగా నమోదైన 7994 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,27,960కి చేరింది. కరోనా బారినపడి 58 మంది మరణించారు. ఇక ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 2208కి చేరింది. బుధవారం 4009 మంది కరోనా నుంచి సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3,49,692కు చేరింది.
తెలంగాణలో రికవరీ రేటు 81.71 శాతంగా ఉండగా, మరణాల రేటు 0.51 శాతంగా ఉంది. రాష్ట్రంలో బుధవారం వరకు 1,28,28,763 నమూనాలను పరీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 76,060 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1630 కరోనా కేసులు వెలుగు చూడగా, మేడ్చల్ మాల్కాజ్గిరి జిల్లాలో 615, రంగారెడ్డిలో 558 కేసులు నమోదయ్యాయి. నల్గొండలో 424, సంగారెడ్డిలో 337, నిజామాబాద్ లో 301, సిద్దిపేటలో 269, మహబూబ్నగర్లో 263, జగిత్యాలలో 238, ఖమ్మంలో 213, సూర్యపేటలో 207, వికారాబాద్లో 207, నాగర్ కర్నూల్లో 206, మంచిర్యాల జిల్లాలో 201 కరోనా కేసులు వెలుగుచూశాయి.