కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలో అపశృతి: ఎడ్లబండిపై నుంచి కిందపడిన దామోదర రాజనర్సింహ
హైదరాబాద్/మెదక్: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపునకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన ప్రదర్శనలో అపశృతి చోటు చేసుకుంది. మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ ఎడ్ల బండిపై నుంచి జారి కిందపడ్డారు. దీంతో ఆయన కాలికి గాయమైంది.
చమురు ధరల పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై ఎడ్ల బండిపై నుంచి ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా జారి కిందపడ్డారు. కాలికి గాయం కావడంతో వెంటనే ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు.

దామోదర రాజనర్సింహ మాట్లాడుతుండగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో బెదిరిన ఎద్దులు పరిగెత్తేందుకు ప్రయత్నించాయి. దీంతో రాజనర్సింహతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఎడ్లబండిపైనుంచి కిందపడ్డారు.
ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం రాజనర్సింహ పాదయాత్రగా వెళ్లారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్ తోపాటు అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు, నిరసనలు చేపట్టాయి. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ఎడ్లబండిపై ఇందిరా పార్క్కు వచ్చారు. ధర్నాకు అనుమతి లేదన్న పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ధర్నా చౌక్ వద్దకు వచ్చిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుతోపాటు ఇతర మహిళా నేతలను అరెస్ట్ చేసి బేగంపేట పోలీస్ స్టేషన్కు తరలించారు.
వరంగల్ అర్బన్ జిల్లాలో కాజిపేట నుంచి హన్మకొండ చౌరస్తా వరకు సైకిళ్లు, ఎడ్లబండ్లు, రిక్షాలతో భారీ ర్యాలీ చేపట్టారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నాయి. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications