వారంలో పోలీస్ కొలువు నోటిఫికేషన్.. సిద్దంగా ఉండండి: మంత్రి హరీశ్ రావు
వారం రోజుల్లో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రానుంది. అభ్యర్థులు రెడీగా ఉండాలని ఆర్థికమంత్రి హరీశ్ రావు కోరారు. తెలంగాణ ప్రభుత్వం 80 వేలకు పైగా కొత్త పోస్టులను భర్తీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో 20 వేలకు పైగా కొలువులు పోలీసు శాఖవే ఉన్నాయి. సంగారెడ్డిలో కానిస్టేబుల్ శిక్షణ తరగతులను హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు సూచించారు. సమయం వృథా చేసుకోకుండా అవకాశాన్ని సద్దినియోగం చేసుకోవాలని సూచించారు.
పారదర్శకంగా నియామకాలు చేపట్టేందుకు బోర్డు సిద్ధంగా ఉంది. ప్రభుత్వం వయోపరిమితిని మూడేళ్లు పెంచటం అభ్యర్థులకు గొప్ప అవకాశం అని చెప్పారు. ఈ సారి అన్ని ఉద్యోగాలకు కలిపి 7 లక్షలకు పైనే దరఖాస్తులు వస్తాయని అంచనా వేశారు. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకొని పక్కాగా ముందుకు వెళ్లేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నారు.
అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిలిమ్స్ కోసం ప్రిపరేషన్ ప్రారంభించాలని నిపుణులు కోరుతున్నారు. ఫిజికల్ ఈవెంట్స్కు కూడా ప్రాక్టీస్ ప్రారంభిస్తే ఆశించిన ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. ఫిజికల్ ఈవెంట్స్ తర్వాత కూడా వారికి రీడింగ్ చూపించి సంతకాలు తీసుకొంటామని బోర్డు చైర్మన్ తెలిపారు. ప్రవేశ పరీక్షల్లో బయోమెట్రిక్ విధానం ఉంటుందని... ఓఎంఆర్ షీట్లు సైతం ఇస్తామని చెప్పారు. ఎవరైనా పోలీస్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశపెడితే మోసపోవద్దని.. అలాంటి వారి సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సీసీ కెమెరాల వాడకం నుంచి ప్రతి దశలో అభ్యర్థుల బయోమెట్రిక్ తప్పనిసరి చేయడం, ఫిజికల్ ఈవెంట్స్, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్పుట్ వేసినప్పుడు ఆ దూరాలను డిజిటల్ థియోడలైడ్స్ పరికరాలతో కొలవటం, ఆ కొలతలు నేరుగా కంప్యూటర్లో నిక్షిప్తం అవటం వంటి సాంకేతికతలు మన రాష్ట్రంలోనే ఉన్నాయని చెప్పారు.