రేవంత్ రెడ్డి చోరీలు చేసేవారు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు
నల్గొండ: తెలంగాణలో కుటుంబ పాలనను బొందపెట్టాలని, ఇప్పుడున్న పరిస్థితులు అది బీజేపీతోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం రావాలనే రాజీనామా చేశానని చెప్పారు. గట్టుప్పల్ మండలంలో పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్బంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు.
Recommended Video
రేవంత్ రెడ్డిని నమ్మి కాంగ్రెస్ పార్టీ నట్టేట మునగడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. తనపై విమర్శలు చేస్తున్న రేవంత్ రెడ్డికి చరిత్ర లేదన్నారు. రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు చోరీలు చేసేవారని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ముందు రేవంత్ రెడ్డి ఫొటో.. వెనకాల చంద్రబాబు ఫొటో ఉందని అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చాక.. సొంత ఆస్తులు అమ్ముకున్నానని తెలిపారు. డబ్బు కోసం అమ్ముడుపోయిన వ్యక్తి ఎవరో ప్రజలకు తెలుసన్నారు.
ఏ కేసులో రేవంత్ జైలుకు పోయారో గుర్తుంచుకోవాలన్నారు. ఎవరెవరు ఎన్నెన్సి ఆస్తులు సంపాదించారో చర్చిద్దామా? అని సవాల్ విసిరారు రాజగోపాల్. ఇది మునుగోడు ప్రజల అభివృద్ధి కోసం వచ్చిన ఎన్నిక.. రాజగోపాల్ రెడ్డి కోసం వచ్చిన ఎన్నిక కాదు. ఇది ఒక యజ్ఞం.. ఒక ధర్మయుద్ధం అని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. డబ్బు సంచులతో టీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.
మునుగోడులో ఈసారి గెలిచేది ప్రజలే అని స్పష్టం చేశారు. మునుగోడు ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో డబ్బుకు అమ్ముడుపోరని ధీమా వ్యక్తం చేశారు. డబ్బు సంచులు, పెన్షన్లు, గొర్రెలు అని ఇలా ఎన్ని ప్రలోభాలు చేసినా మునుగోడు ప్రజలు అమ్ముడుపోరన్నారు. టీఆర్ఎస్ పార్టీ సర్కారుకు చరమగీతం పాడేందుకే.. నరేంద్ర మోడీ, అమిత్ షాల నాయకత్వంలో బీజేపీలో చేరినట్లు రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.