76 కుటుంబాలకు దళిత బంధు.. ఊరంతా కొత్త ఇళ్లు కడతాం: సీఎం కేసీఆర్
దుర్మార్గాలతో యావత్ ప్రపంచం బాధింపబడుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో నిర్లక్ష్యానికి, అణచివేతకు, వివక్షకు గురైన జాతి దళితజాతి అని చెప్పారు. దళితుల్లో ఐకమత్యం రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నామని ప్రకటించారు. రేపటినుంచే దళితుల చేతుల్లో రూ. 10 లక్షల చొప్పున డబ్బులు ఉంటాయని స్పష్టం చేశారు. వాసాలమర్రి గ్రామానికి దళిత బంధు కోసం రూ. 7.60 కోట్లు తక్షణమే మంజూరు చేస్తున్నానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దళిత బంధు నిధులను ఒకే విడుతలో పంపిణీ చేస్తామని చెప్పారు. ఆలేరు నియోజకవర్గంలో రూ. 30 కోట్లతో దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వాసాలమర్రి పర్యటన సందర్భంగా అక్కడ సీఎం కేసీఆర్ ప్రసంగించారు.

నిరుపేదలు దళితులే..
ఏ ఊరికి, జిల్లాకు వెళ్లినా.. ఆ ఊరి సెంటర్లో నిలబడి.. నిరుపేదలు ఎవరని అడిగితే దళితులే అని చెబుతారని కేసీఆర్ గుర్తుచేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్.. ఈ జాతి ప్రజల అన్యాయం జరుగుతుందని చెప్పి.. పోరాటాలు చేశారని గుర్తుచేశారు. అంబేడ్కర్ పోరాటం వల్ల రాజకీయంగా, చదువుకునేందుకు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వచ్చాయన చెప్పారు. దళితులకు మార్గం చూపించారని.. కానీ పూర్తిస్థాయిలో జరగలేదన్నారు. దళితులు రోజు చెమట్చోడినా.. ఎందుకు పేదరికంలో ఉండాల్సి వచ్చింది? అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు సరైన పంథాలో వెళ్లకపోవడం, వారి కోసం ప్రవేశపెట్టిన పథకాలను ఆ వర్గాల్లోకి తీసుకోకపోవడం వల్ల దళితులు పేదరికంలోనే ఉన్నారని వివరించారు. దళిత బంధు డబ్బులతో ఇష్టమొచ్చిన వ్యాపారం పద్ధతిగా చేసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.

అర్హులకు సాయం అందాలి..
ప్రభుత్వం సాయం చేసిన సమయంలో .. ఏ పథకం కూడా నీరుగారి పోవద్దన్నారు. మొండి పట్టుదలతో పైకి రావాలని.. దళిత వాడల్లో బాగా ఐకమత్యం రావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కేసులను రద్దు చేసుకుని, ప్రేమ భావంతో మెలగాలని కోరారు. హుజురాబాద్ మొత్తం తీసుకుని దళితబంధును అమలు చేస్తున్నాం అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఊరిలో ప్రభుత్వ స్థలం 612 ఎకరాల భూమి ఉంది అని చెప్పారు.

తక్కువ స్థలం.. విచారణ జరపాలి...
దళితుల వద్ద చాలా తక్కువ స్థలం ఉందని.. కబ్జా పెట్టిన భూములపై విచారణ జరిపించామని తెలిపారు. వారి వివరాలను సేకరించామని వెల్లడించారు. గ్రామంలో 76 దళిత కుటుంబాలు ఉన్నాయని.. వాసాలమర్రిలో 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ మిగులు భూమి ఉందన్నారు. ప్రభుత్వ మిగులు భూములను దళిత కుటుంబాలకు పంపిణీ చేస్తామన్నారు. దళితుల భూమిని ఇతరులు తీసుకునే అర్హత లేదన్నారు. ప్రతి దళిత బిడ్డ రైతు కావాలని.. వాసాలమర్రిలో కొత్త చరిత్ర సృష్టించాలి అని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

అన్నీ మట్టి ఇళ్లే..
అభివృద్ధి చేయాలని కార్యాచరణ రూపొందించుకుంటున్నాం అని కేసీఆర్ తెలిపారు. గ్రామం మొత్తం తిరిగానని.. కొన్ని ఇళ్లు మట్టితో ఉన్నవని చెప్పారు. ఒక్కటి కూడా ఇటుకల ఇల్లు కనబడలేదని చెప్పారు. కూలిపోయే దశలో ఉన్నాయని చెప్పారు. వరద నీరు ఇళ్లలోకి వచ్చేలా గ్రామం ఉందన్నారు. మొత్తం ఊరు కూలగొట్టి.. మంచిగా చేసుకుందాం అని.. రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు వీధి దీపాలను ఏర్పాటు చేసుకుందామని చెప్పారు. ఎర్రవెల్లిలో ఊరు మొత్తానికి కూలగొడితే ఊరోళ్లు ఎక్కడ ఉండాలి అనే ప్రశ్న వచ్చిందని.. మద్రాస్ నుంచి ప్రత్యేకమైన టెంట్లను తెప్పించి.. దాంట్లో ఉంచామని గుర్తుచేశారు. ఊరు కట్టిన తర్వాత అందరూ ఇండ్లలోకి వచ్చారని.. వాసాలమర్రిలో కూడా అలా జరగాలని కోరుకుంటున్నా అని కేసీఆర్ తన మనసులోని మాటను బయటపెట్టారు. ఇంజినీరింగ్ పద్ధతుల్లో ఇళ్లు నిర్మించుకుంటే సుఖజీవనం ఉంటుందని.. దళితులే కాదు బీసీలు కూడా పేదరికంలోనే ఉన్నారని చెప్పారు.

దత్తత గ్రామం..
వాసాలమర్రి గ్రామాన్ని కేసీఆర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల వాసాలమర్రిలో గ్రామస్తులతో సహపంక్తి భోజనం కూడా చేశారు. తర్వాత గ్రామసభ నిర్వహించారు. మరో 20 సార్లు వాసాలమర్రికి వస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం బుధవారం గ్రామాన్ని సందర్శించారు. ఇంతకుముందు జూలై 9న గ్రామ పర్యటనకు సిద్ధమయ్యారు. కానీ అనివార్య కారణాల వద్ద వాయిదా పడింది. ఈ సారి క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు. యాదాద్రిలో ఆయన ఆలయ పనులను పర్యవేక్షిస్తారు. యాదాద్రి ఆలయ పనులను వేగంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఇదివరకే అధికారులకు స్పష్టంచేశారు.
Recommended Video

బై పోల్ నేపథ్యంలో..
హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే దళిత బంధు పథకాన్ని కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చింది. ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నిక పూర్తయితే ఎవరూ పట్టించుకోరు అని అంటున్నారు. ఇదివరకటి పథకాలు.. దళితుడు సీఎం నినాదాలు ఏమయ్యాయని అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అదేం లేదని అంటోంది. తాము సంక్షేమ పథకానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది. దళితులు.. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ముఖ్యం అని చెబుతోంది. అణగారిన వర్గాల అభివృద్ది ముఖ్యం అని స్పష్టంచేసింది. ప్రభుత్వం చెప్పినా మాట.. ఎన్నిక తర్వాత ఏం జరుగుతుందో చూడాలీ మరీ. ప్రభుత్వం చెప్పినట్టు చేస్తోందా.. ? లేదంటే మిన్నకుండిపోతుందా అనే విషయం తెలియనుంది.












Click it and Unblock the Notifications