హుజూర్నగర్ మరో నిజామాబాద్: ఉప ఎన్నిక బరిలో 60 నుంచి 80 అభ్యర్థులు
Recommended Video
హుజూర్నగర్ ఉప ఎన్నికకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. ప్రధాన పార్టీల తరఫున అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలకే పూర్తవ్వాలి. కానీ భారీగా అభ్యర్థులు పోటీ చేసేందుకు ఆసక్తి కనబరచడంతో నామినేషన్ల స్వీకరణ ఆలస్యమవుతుంది. విశ్వసనీయ సమాచారం మేరకు 60 నామినేషన్లు ఇప్పటికే దాఖలైనట్టు తెలుస్తోంది. మరో 20 మంది అభ్యర్థులు క్యూ లైన్లో ఉన్నారని హుజూర్నగర్ రెవెన్యూ సిబ్బంది మీడియాకు వివరించారు.
స్క్రూటీని..
నామినేషన్లను మంగళవారం స్క్రూటినీ చేస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు అక్టోబర్ 3 వరకు ఇచ్చారు. ఆ రోజు సాయంత్రం పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. వచ్చేనెల 21న పోలింగ్ నిర్వహించి.. 24న ఫలితాలు వెల్లడిస్తారు. హుజూర్నగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీలు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హుజూర్నగర్ గడ్డ మీద గెలిచి చరిత్ర తిరగరాయాలని భావిస్తున్నారు.
వీరే అభ్యర్థులు..
కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్రెడ్డి సతీమణి పద్మావతి బరిలోకి దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పద్మావతి కోదాడ నుంచి పోటీచేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి, బీజేపీ నుంచి డాక్టర్ రామారావు, టీడీపీ నుంచి చావా కిరణ్మయి బరిలోకి దిగారు. వీరితోపాటు ఉత్తమ్, కేసీఆర్పై ధిక్కార స్వరం వినిపిస్తూ తీర్మార్ మల్లన్న (నవీన్) రంగంలోకి దిగారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల గోడు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో నియామకాల జాడే లేదని విమర్శిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ నుంచి విద్యార్థి సంఘ నాయకుల బరిలో దిగారు.
గిరిజనులు కూడా..
పోడు భూములపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై గిరిజనులు గుస్సా మీద ఉన్నారు. దీంతో ఇక్కడినుంచి గిరిజన రైతులు కూడా బరిలోకి దిగారు. మరోవైపు సర్పంచ్ల సంఘం తరఫున అభ్యర్థులు కూడా పోటీచేస్తున్నారు. ఉప సర్పంచ్తో కలిసి చెక్ పవర్ కల్పించడంపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రచార పర్వంలోకి నేతలు దూసుకెళ్లారు.
ఇక ప్రచారబరిలో..
సాయంత్రం కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. రెండురోజుల్లో సీఎం కేసీఆర్ కూడా బహిరంగ సభలో పాల్గొంటారని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ మద్దతిస్తోంది. ఈ విషయాన్ని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి కూడా ధ్రువీకరించారు. హుజూర్నగరే కాదే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్, సీపీఐ కలిసి పోటీచేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.