ఢిల్లీ పీఠమే దుమ్మురేగే పరిస్థితి: నిన్నమొన్న చూసింది గింతేనంటూ కేసీఆర్
నల్గొండ: దేశం పరిస్థితి పైన పటారం.. లోన లోటారంలా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. మోడీ చేసేది విశ్వగురువా? విష గురువా? అని ప్రశ్నించారు. చండూరులో ఆదివారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. కేంద్రం అరాచక పాలన కొనసాగిస్తోందని మండిపడ్డారు.
బీజేపీకి బుద్ధి చెప్పాలంటూ కేసీఆర్
మతోన్మాద బీజేపీకి బుద్ధి చెప్పాలని కేసీఆర్ అన్నారు. డాలర్ మారకం విలువ 82 రూపాయలకు మారిందన్నారు. నిత్యావసరాల ధరలు పెరిగాయన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందెవరని ప్రశ్నించారు. గ్యాస్ సిలిండర్ ధరలు పెంచారన్నారు. అయినా ఆ పార్టీకే ఓటేద్దామా? అని కేసీఆర్ ప్రశ్నించారు. కరెంటు ప్రైవేటీకరించి దోచుకుంటారు. పండిన పంటలు కూడా కొనలేదు. కానీ, వందలకోట్లతో ఎమ్మెల్యేలను కొంటారట. బీజేపీకి బుద్ధి చెప్పాలి అని కేసీఆర్ అన్నారు.
ఢిల్లీ పీఠమే దుమ్మురేగే పరిస్థితి: ఎమ్మెల్యేల కొనుగోళ్లపై కేసీఆర్
తెలంగాణలోనే రైతు బీమా ఉంది. రైతుబంధు ఇస్తున్నాం. ఉచితాలు వద్దట. 14 లక్షల కోట్లు కార్పొరేట్లకు ఇచ్చింది మోడీ సర్కారు. లక్షా 45వేల కోట్లు రైతులకు ఇవ్వలేమా? మునుగోడులో ఓట్లడిగితే ముందు బీజేపీ నేతలు దీనికి సమాధానం చెప్పాలని కేసీఆర్ అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చనోళ్లు జైల్లో ఉన్నారన్నారు. తలమాసినోడు ఒకడు తడిబట్టలతో ప్రమాణం చేస్తారా? అంటడు. మరొకడు పొడిబట్టలతో అంటడు. ఈ వ్యవహారం కోర్టులో ఉన్నందున ఎక్కువ మాట్లాడను. నిన్నమొన్న చూసింది గింతే.. ఢిల్లీ పీఠమే దుమ్మురేగే పరిస్థితి ఉందంటూ సంచలన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాలకు గురిచేసిన వ్యవహారంపై కేసీఆర్ ఈ మేరకు స్పందించారు. మతోన్మాద అరాచకులను తన్నితరిమేయాలని కేసీఆర్ అన్నారు.
జగదీశ్ రెడ్డి ఏం చేశారని నిషేధం?: టీఆర్ఎస్ గెలుపుపై కేసీఆర్
నల్గొండ మహనీయులు నడియాడిన నేల అని కేసీఆర్ అన్నారు. వామపక్షాలు, టీఆర్ఎస్ కలిసి పనిచేస్తాయన్నారు. తాను ఇక్కడ మంత్రి జగదీశ్ రెడ్డి లేకుండా ఏ సభలోనూ పాల్గొనలేదని అన్నారు కేసీఆర్. ఏం దౌర్జన్యం చేశారని జగదీష్ రెడ్డిని నిషేధించారని ప్రశ్నించారు. 3వ తారీఖు వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. మునుగోడులో బ్రహ్మండమైన మెజార్టీతో గెలుస్తున్నామని సాంబశివరావు చెప్పారని తెలిపారు. కారు గుర్తుకు ఓటేసి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కేసీఆర్ మునుగోడు ప్రజలను కోరారు. చండూరు వంద పడకల ఆస్పత్రితోపాటు ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు. రోడ్లు కూడా బాగుపడతాయని చెప్పారు. ప్రజలందరికీ ధన్యవాదాలు చెబుతూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.