హుజుర్నగర్ మాదే.. కారుదే విజయం.. ఉత్తమ్వి వట్టి మాటలే : మంత్రి సత్యవతి రాథోడ్
నల్గొండ : హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే విజయమన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. కారు జోరు ఇక్కడ కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీ సాధించిన టీఆర్ఎస్ పార్టీ హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నేరేడు చర్లలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి ఈ సందర్భంగా పలు అంశాలు ప్రస్తావించారు.
టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్తో పాటు హుజుర్నగర్ బై పోల్స్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు ఎంపీలు మాలోతు కవిత, బండ ప్రకాశ్.. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తదితర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడుతుందన్నారు మంత్రి.
యెల్లో యెల్లో తంగేడు పూలు.. మల్లెను మించిన గునుగు పూలు.. బతుకమ్మ సంబురాలు షురూ
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలేనని ఎద్దేవా చేశారు మంత్రి. నల్గొండ జిల్లా ప్రజల సమస్యలను కాంగ్రెస్ పార్టీ ఏనాడూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఆ క్రమంలో హుజుర్నగర్ బై పోల్స్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ప్రజలకు లాభం జరుగుతుందని చెప్పుకొచ్చారు.
ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి లాభం తప్ప మరో ప్రయోజనం ఉండబోదని ఆరోపించారు. తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు. అదలావుంటే హుజుర్నగర్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపు ఖాయమని చెప్పుకొచ్చారు ఎంపీ మాలోతు కవిత. కేసీఆర్ పాలన అంటే ప్రజలు మెచ్చుకుంటున్నారని.. ఆయన పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వ్యాఖ్యానించారు.