హుజూర్ నగర్ లో నంద్యాల ఫార్ములా: పక్కా వ్యూహాత్మకంగా: ఒక్కటే మార్పు..!
హుజూర్ నగర్ లో అధికార టీఆర్ యస్ పార్టీ అమలు చేసిన వ్యూహం..నాటి నంద్యాల ఉప ఎన్నిక ఫార్ములాను గుర్తు తెస్తోంది. నాడు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ నంద్యాల ఉప ఎన్నికలో గెలుపు కోసం గ్రామం యూనిట్ గా..సామాజిక వర్గాల ఆధారంగా ఆకట్టుకొనే వ్యూహాలను అమలు చేసింది. మంత్రులకు సమన్వయ బాధ్యతలు..క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేలకు కేటాయించారు. అదే విధంగా అధికారంలో ఉన్న తమకు ఓటు వేస్తేనే నంధ్యాలకు భవిష్యత్ ఉంటుందని నమ్మించారు. ప్రభుత్వ పధకాలను పూర్తిగా అక్కడి వారికి అందేలా వ్యవహరించారు. ఇప్పుడే అదే జరిగింది. హుజూర్ నగర్ లో అధికార పార్టీ అభ్యర్ధిని గెలిపిస్తే..నియోజకవర్గం రూపు రేఖలు మారి పోతాయని ప్రచారం చేసారు. ప్రభుత్వానికి ఇంకా నాలుగేళ్ల సమయం ఉందని నియోజకవర్గానికి ఏం చేయాలో..అన్నీ చేస్తామని హమీ ఇచ్చారు. ఇక, పొలిటికల్ మేనేజ్ మెంట్ తో ఇతర పార్టీలు దరి దాపుల్లోకి రాలేని విధంగా గ్రామాల్లోని వార్డు స్థాయి నుండి అధికార టీఆర్ యస్ పక్కగా వ్యూహం అమలు చేసింది. ఫలితంగా ఊహించని మెజార్టీ సాధించింది.
నాటి నంద్యాల ఫార్ములానే..ఇక్కడ
ఇప్పుడు హుజూర్ నగర్ లో అధికార పార్టీ అమలు చేసిన వ్యూహం గమనిస్తే..నాడు భూమా నాగిరెడ్డి మరణంతో జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ అమలు చేసిన ఫార్ములానే ఇక్కడ అమలు చేసినట్లు కనిపిస్తోంది. నాడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని..ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందని అందరూ అంచనా వేసారు. అయితే, నాటి సీఎం తమ పట్టు నిరూపించుకొనేందుకు నంద్యాల లో గ్రామ స్థాయి నుండి పార్టీ నేతలను మొహరించి బాధ్యతలను అప్పగించారు. పలువురు మంత్రులను రంగంలోకి దింపారు. అధికారంలో ఉన్న తమకు ఓటు వేస్తేనే నంద్యాల పురోగతి సాధిస్తుందంటూ.. అప్పుడే అక్కడ మొదలు పెట్టిన కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తామని హమీ ఇచ్చారు. ఇప్పుడు అదే విధంగా హుజూర్ నగర్ భవిష్యత్ పైన అధికార పార్టీ నేతలు ఓటర్లకు వివరించారు. తాము ఇంకా నాలుగేళ్ల పాటు అధికారంలో ఉంటామని నియోజకవర్గాన్ని చూసుకొనే బాధ్యత తమదేనని చెప్పుకొచ్చారు. గ్రామ స్థాయి నుండి ప్రతీ వార్డులో పోల్ మేనేజ్ మెంట్ పక్కాగా చేసుకున్నారు. పార్టీ అధినాయకత్వం కనుసన్నల్లో పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు అమలు చేసారు.

మంత్రులు..ఎమ్మెల్యేలదే కీలక పాత్ర
నాడు నంద్యాల ఎన్నికల్లో టీడీపీ మంత్రులు మొత్తం దాదాపు 13 మంది అక్కడ మొహరించారు. ఇప్పుడు హుజూర్ నగర్ లో నలుగురు మంత్రులు పూర్తిగా బాధ్యతలు తీసుకున్నా..ఇద్దరు మాత్రం అక్కడే పూర్తిగా ఎన్నికల్లో మునిగిపోయారు. ఇక, ఎమ్మెల్యేలను రంగంలోకి దించారు. పార్టీ నేతలకు ప్రాంతాల వారీగా బాధ్యతలు కేటాయించారు. నాడు చంద్రబాబు..జగన్ ఇద్దరూ నంద్యాలలో ప్రచారం చేసారు. వైసీపీ అధినేత జగన్ దాదాపు 13 రోజుల పాటు అక్కడే మకాం వేసారు. హుజూర్ నగర్ లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఇక్కడ తన సతీమణి అభ్యర్ధి కావటంతో గెలుపును ప్రతిష్ఠాత్మకం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచార సభలో పాల్గొనాల్సి ఉన్నా చివరి నిమిషంలో రద్దయింది. ఇక, ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలు నియోజకవర్గంలోని ప్రతీ కుటుంబానికి అందాయా లేదా అనే అంశం మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. దీంతో పాటుగా అధికార పార్టీకి సహజంగా ఉండే అడ్వాంటేజ్ ను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ఇలా..నాడు నంద్యాల..నేడు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీలు గెలుపొందాయి.












Click it and Unblock the Notifications