కేసీఆర్! మీ పిల్లలు బాగుంటే సరిపోతుందా?: వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు
నల్గొండ: తెలంగాణ ప్రభుత్వ విధానాలపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆరోపించారు. మంగళవారం నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఎదుట నిర్వహించిన నిరుద్యోగ నిరాహార దీక్షలో షర్మిల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాల్లోని ఖాళీలను ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. వర్సిటీలు నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని ఆరోపించారు.

బంగారు తెలంగాణా తెస్తామని చెప్పిన కేసీఆర్ బారుల తెలంగాణ.. బీరుల తెలంగాణగా మార్చారని విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీ 33 శాతం, తెలంగాణలో ఏ యూనివర్సిటీలో చూసినా 63 శాతం ఖాళీలే ఎక్కువగా ఉన్నాయని షర్మిల తెలిపారు. విద్యార్థుల భవిష్యత్పై సీఎం కేసీఆర్కు ఆలోచన లేదా?....మీరు మీ పిల్లలు బాగుంటే సరిపోతుందా? అని ఆమె ప్రశ్నించారు.
బాగా చదువుకుంటే ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయడం లేదా? అని నిలదీశారు. ఇప్పుడు యూనివర్సిటీ భూములపై టీఆర్ఎస్ నాయకుల కన్ను పడిందని ఆరోపించారు.12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ముస్లింలకు కేసీఆర్ అన్యాయం చేశారన్నారు. ముస్లింలకు ఎక్కువగా ద్రోహం చేసింది సీఎం కేసీఆరేనని షర్మిల వ్యాఖ్యలు చేశారు. అనంతరం ప్రతి మంగళవారం రాష్ట్రంలోని నిరుద్యోగులకు సంఘీభావంగా చేపట్టే నిరాహార దీక్షలో వైఎస్ షర్మిల కూర్చున్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.
వైఎస్ షర్మిల పార్టీ ప్రారంభం నాటి నుంచి కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతున్న విషయం తెలిసిందే. హామీలు నెరవేర్చడం లేదంటూ, ఉద్యోగ నోఫికేషన్లు వేయడం లేదంటూ, రాష్ట్రంలోని సమస్యలను ప్రస్తావిస్తూ కేసీఆర్ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇటీవల షర్మిల మాట్లాడుతూ..
దొర మాటిచ్చి 4 ఏళ్లైనా బీసీ పాలసీ అమలు పత్తా లేదని మండిపడ్డారు.
బీసీలంటే దొరగారి మీటింగ్లకు మందిని తెచ్చేవారు, గొర్లు, బర్లు కాసుకునే వారు, ఆత్మగౌరవ భవనాలకు అమ్ముడుపోయేవారు. అంతే తప్ప.. అధికారంలో పాలుపంచుకునే వారు, చట్టాలు చేసేందుకు అర్హులు కారు, అభివృద్ధికి నోచుకునే వారు కాదంటూ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అందుకే కేసీఆర్ దొర 2017లో మీటింగ్ పెట్టి మూడు రోజులు ముచ్చట చేసిన 210 తీర్మానాలు మూలకు పెట్టిండు, బీసీ సబ్ ప్లాన్ లేదు, ఇండస్ట్రియల్ పాలసీ లేదు, నిధులు లేవు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. 210 తీర్మానాలను గంగలో కలిపాడు. ఇది దొరగారికి 54 శాతం ఉన్న బీసీలపై ఉన్న ప్రేమ అంటూ సీఎం కేసీఆర్పై విమర్శలతో విరుచుకుపడ్డారు వైఎస్ షర్మిల.












Click it and Unblock the Notifications