ప్రజాప్రస్థానాన పాదయాత్ర అడ్డుకునే కుట్ర: వైఎస్ షర్మిల
ప్రజాప్రస్థానం పాదయాత్రలో వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. బొల్లేపల్లి గ్రామంలో YSR తెలంగాణ పార్టీ కార్యకర్త ఫ్లెక్సీ కడుతుండగా.. టీఆర్ఎస్ గూండా దాడి చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావించి.. దాడులు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా భువనగిరి నియోజకవర్గం బీబీనగర్ మండలం మామిల్లగూడెం గ్రామం నుంచి షర్మిల ఇవాళ పాదయాత్ర ప్రారంభించారు.

ఏం చేశారు..
కేసీఆర్ ని నమ్మి అధికారం కట్టబెడితే ప్రజలకు ఏం మేలు చేయలేదు. కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశాడు. దళిత ముఖ్యమంత్రి, రుణమాఫీ, వడ్డీ లేని రుణాలు, ఇంటికో ఉద్యోగం అని చెప్పి మోసం చేశాడు. కేజీ టూ పీజీ ఉచిత విద్య, నిరుద్యోగ భృతి అంటూ ప్రజలను నమ్మించాడు. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో దగా చేశాడు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని నట్టేట ముంచాడు. దళితులకు మూడెకరాల భూమి, గిరిజనులకు పోడు పట్టాలు ఇస్తామని మోసం చేశారు. బంగారు తెలంగాణ పేరుతో ఆత్మహత్యల తెలంగాణ, అప్పుల తెలంగాణగా మార్చాడు. ఇంట్లో అర్హులు ఇద్దరుంటే ఒకరికే పెన్షన్ ఇవ్వడం అన్యాయం. మేం అధికారంలోకి వస్తే ఇంటిల్లిపాది అర్హులందరికీ పెన్షన్లు ఇస్తాం. కేసీఆర్ రైతుబంధు పేరుతో ఎకరాకు రూ.5వేలు ఇచ్చి రూ.25వేల విలువైన ఇతర పథకాలన్నీ ఎగ్గొడుతుండు.రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ లేదు. రాయితీపై విత్తనాలు లేవు. సబ్సిడీపై ఎరువులు లేవు. యంత్ర లక్ష్మి బంద్ పెట్టిండు. ఇలా అన్ని పథకాలను పక్కన పెట్టి కేవలం రైతు బంధు మాత్రమే అమలు చేస్తుండు. అది కూడా కొందరికే.
పండగే
ఆనాడు వైయస్ఆర్ దండగ అనుకున్న వ్యవసాయాన్ని పండగ చేసి చూపించాడు. రైతులకు పంట నష్టపోతే నష్టపరిహారం అందించారు. నేడు కేసీఆర్ రైతులను వరి వేయొద్దు అంటున్నారు. ఇక్కడి చాలా భూముల్లో వరి మాత్రమే పండుతుంది. అలాంటి వరి కాదని వేరే పంట వేసి రైతులు నష్టపోవాలా? నచ్చిన పంట సాగు చేసుకోనివ్వకుండా కేసీఆర్ రైతును బానిస చేస్తుండు. రాష్ట్రంలో డిగ్రీలు, పీజీలు చదివిన వారు గొర్రెలు బర్రెలు కాసుకుంటున్నారు, కూలీ పనులు చేసుకొని బతుకుతున్నారు. మేం అధికారంలోకి వస్తే చదువుకున్న వారందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం. ఇన్నాళ్లుగా ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ప్రతిపక్షాలు ఏనాడూ ప్రశ్నించలేదు. ప్రజల పక్షాన నిలబడడానికి, ప్రజల తరఫున పోరాటం చేయడానికి YSR తెలంగాణ పార్టీ పుట్టింది. మళ్లీ వ్యవసాయాన్ని పండుగ చేయడమే మా లక్ష్యం. మహిళలు మళ్లీ ఆర్థికంగా బలపడేలా రుణాలు ఇస్తాం. మహిళల పేరు మీద ఇండ్లు కట్టిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ , మహిళలు, రైతులు ,నిరుద్యోగులు, విద్యార్థులు, వికలాంగులు ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడమే మా ధ్యేయం. ప్రజలు కేసీఆర్ గారడీ మాటలను మళ్లీ మళ్లీ నమ్మవద్దు. ఎన్నికలు వస్తేనే కేసీఆర్ గారికి పథకాలు గుర్తుకొస్తాయి. రాబోయే ఎన్నికల్లో మళ్లీ దొంగ హామీలే ఇస్తాడు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మాట తప్పని రాజన్న బిడ్డను నేను. ఆఖరి క్షణం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజన్న బిడ్డగా చెబుతున్నా రాష్ట్రంలో మళ్లీ వైయస్ఆర్ సంక్షేమ పాలన తీసుస్తానని స్పష్టంచేశారు.
అడ్డుకునే యత్నం
ప్రజాప్రస్థానం పాదయాత్రను అడ్డుకునేందుకు పాలకపక్షంతోపాటు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయి. తెలంగాణలో ప్రశ్నించే గొంతుకగా ఎదుగుతున్న YSR తెలంగాణ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక, పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నాయి. బుల్లేపల్లిలో మా పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీ కడుతుండగా.. ఓ టీఆర్ఎస్ గూండా కత్తులతో దాడికి పాల్పడ్డాడు. తాళ్లతో మెడకు బిగించి, హత్య చేయబోయాడు. ఈ పెనుగులాటలో కార్యకర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. సదరు దుండగుడు(తాళ్లపల్లి శ్రావణ్) గతంలో కాంగ్రెస్ తరఫున వార్డు మెంబర్ గా పోటీ చేసి, ఓడిపోయాడు. అనంతరం టీఆర్ఎస్ లో చేరాడు. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటూ షర్మిలక్క పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. పార్టీ కార్యకర్తపై కత్తితో దాడికి దిగి, తాడుతో మెడకు మెలికపెట్టాడు. దీంతో పార్టీ కార్యకర్తకు గాయాలయ్యాయి. మా పార్టీ కార్యకర్తపై దాడికి పాల్పడ్డ దుండగుడిని వెంటనే అరెస్ట్ చేయాలి. పాలక, ప్రతిపక్షాల అరుపులకు అదిరేది లేదు. బెదిరింపులకు బెదిరేది లేదు. ప్రజాప్రస్థానాన్ని అడ్డుకునే వారే లేరని స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications