వైసీపీ ప్రజాప్రతినిధులను వెంటాడుతోన్న కరోనా: మరో ఎమ్మెల్యేకు పాజటివ్: వైఎస్సార్ ఆసరాలో
నెల్లూరు: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు కరోనా వైరస్ బెడద తప్పట్లేదు. కరోనా మహమ్మారి వారిని వెంటాడుతోంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. వారిలో కొందరు సంపూర్ణ ఆరోగ్యం నుంచి కోలుకోగా.. మరికొందరు చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారిలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, శిల్పా చక్రపాణి రెడ్డి, సుధాకర్, కిలివేటి సంజీవయ్య ఉన్నారు.
తాజాగా మరో ఎమ్మెల్యే కరోనా వైరస్ బారిన పడ్డారు. నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తాజాగా కరోనా సోకింది. దీనితో ఆయనను అపోలో ఆసుపత్రికి చేర్పించారు. చికిత్స పొందుతున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. అన్లాక్ అనంతరం కోటంరెడ్డి తరచూ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మొన్నటికి మొన్న వైఎస్సార్ ఆసరా పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నాయకులు, పార్టీ కార్యకర్తలను కలుసుకుంటున్నారు.
ఈ సందర్భంగా ఆయన కరోనా వైరస్ సోకి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ఆయనకు పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీనితో డాక్టర్ల సలహా మేరకు కుటుంబ సభ్యులు ఆయనను అపోలో ఆసుపత్రికి చేర్పించారు. చికిత్స తీసుకుంటున్నారు. కోటంరెడ్డి ఆరోగ్యం బాగుందని, ఎవరూ ఆందోళన పడొద్దని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. త్వరలోనే కోలుకుంటారనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆయనను కలిసిన వారు కూడా కరోనా పరీక్షలను చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు.
Recommended Video
కాగా- నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. శనివారం వెలువడిన బులెటిన్ ప్రకారం.. నెల్లూరు జిల్లాలో 24 గంటల్లో 711 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ జిల్లాలో ఇప్పటిదాకా 42,530 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వారిలో 36,909 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 5,237 మంది చికిత్స పొందుతున్నారు. 384 మంది కరోనా వల్ల మృత్యువాత పడ్డారు. మొత్తంగా రాష్ట్రంలో 5,57,587 కరోనా కేసులు నమోదు కాగా.. ఇందులో 4,57,008 మంది డిశ్చార్జి అయ్యారు. యాక్టివ్ కేసులు 95,733గా నమోదు అయ్యాయి. 4846 మంది మరణించారు. రాష్ట్రంలో మొట్టమొదటి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది ఈ జిల్లాలోనే.