ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ ఆరంభం: భారీ బందోబస్తు..
నెల్లూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ ఆరంభమైంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాలు, ఆత్మకూరు మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన బూత్లల్లో పోలింగ్ ప్రశాంతంగా మొదలైంది. సాయంత్రం వరకు కొనసాగుతుంది. 26వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం 2,13,400 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
వీరిలో 1,06,021 మంది పురుషులు, 1,07,368 మంది మహిళలు, 11 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వారికోసం 270 మంది పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో 131 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. అక్కడ అదనపు పోలీసు బలగాలను మోహరింపజేశారు. 1,500 మంది పోలీసులు, 11 సీఆర్పీఎఫ్, ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ను ఎన్నికల భద్రత కోసం వినియోగిస్తోన్నారు అధికారులు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ను విధించారు. వీరితో పాటు 38 మొబైల్ పార్టీలు, ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్స్, 23 స్ట్రైకింగ్ ఫోర్స్ను అందుబాటులో ఉంచారు. ఈ ఉప ఎన్నికలో మొత్తం 14 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొని ఉంది.
వైసీపీ తరఫున మేకపాటి విక్రమ్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా భరత్ కుమార్ యాదవ్ బరిలో ఉన్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరమైంది. విక్రమ్ రెడ్డి.. ఆయన సోదరుడే. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆత్మకూరు నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 82.44 శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి కూడా పోలింగ్ శాతం భారీగా ఉంటుందనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందనేది 26వ తేదీన తేలిపోతుంది.