పరిపాలనలో లోపాలున్నాయ్: సరిదిద్దుకుంటేనే..: మరో నవీన్ పట్నాయక్గా: మేకపాటి కీలక వ్యాఖ్యలు
నెల్లూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి లేని లోటును ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూడ్చుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, లోక్సభ మాజీ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ లేని లోటును పూడ్చగల నాయకుడు జగన్ ఒక్కడేనని తాను బలంగా విశ్వసించానని చెప్పారు. తన నమ్మకం వమ్ము కాలేదని పేర్కొన్నారు. ఆ నమ్మకంతోనే తాను వైఎస్ కుటుంబం వెంటే నిలవాలని నిర్ణయం తీసుకున్నానని వ్యాఖ్యానించారు.
కష్టనష్టాలు ఎదురైనా..
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాల్లో తన కుమారుడు మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయం సాధించడంపై స్పందించారు. రాజకీయంగా గానీ, వ్యాపారపరంగా గానీ తన కుటుంబానికి ఎన్ని కష్టనష్టాలు సంభవించినప్పటికీ.. వైఎస్ జగన్ వెంటే నిలవాలని తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినప్పుడే నిర్ణయం తీసుకున్నానని అన్నారు. వైఎస్సార్ వల్ల లబ్దిపొందిన వారు వైఎస్ జగన్కు వ్యతిరేకంగా నిలిచారని, అలాంటి ప్రతికూల సమయంలోనూ తాను ఆ కుటుంబం వెంటే ఉన్నానని గుర్తు చేశారు.
తండ్రిలాగే నాయకత్వ లక్షణాలు..
తన తండ్రిలాగా వైఎస్ జగన్ ఖచ్చితంగా రాష్ట్రానికి, కోట్లాదిమంది తెలుగు ప్రజలకు మేలు చేస్తాడనే బలమైన నమ్మకం తనకు ఉండేదని చెప్పారు. తన అంచనాలు ఏ మాత్రం తప్ప లేదని మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు కేసులు బనాయించి 16 నెలల పాటు జైల్లో పెట్టినప్పుడు జగన్ పనైపోయిందంటూ వైఎస్సార్ ద్వారా లబ్ది పొందిన నాయకులు కూడా వ్యాఖ్యానించడం తనను బాధించిందని చెప్పారు.
నవీన్ పట్నాయక్ తరహాలో..
తాను, తన కుటుంబం మాత్రం వైఎస్ జగన్ వెంటే ఉన్నామని, పాదయాత్రలో ఆయనతో కలిసి నడిచామని మేకపాటి చెప్పారు. తన తండ్రిలాగే వైఎస్ జగన్కు గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ప్రశంసించారు. తన పరిపాలనలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకుంటూ మరో 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ తరహాలో వైఎస్ జగన్ చిరకాలంగా ముఖ్యమంత్రిగా పని చేస్తారని జోస్యం చెప్పారు.
చిన్న, చిన్న పొరపాట్లు ఉన్నాయ్..
ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ 25 సంవత్సరాలను పూర్తి చేసుకోబోతోన్నారని, ఈ దఫా కూడా ఆయనే గెలుస్తారని చెప్పారు. నవీన్ పట్నాయక్లాగే వైఎస్ జగన్ కూడా సుదీర్ఘకాలం పాటు రాష్ట్రాన్ని పరిపాలించాలని అకాంక్షిస్తున్నానని అన్నారు. చిన్న, చిన్న పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలని మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. చాలాకాలం పాటు వైఎస్ జగన్ పరిపాలన కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని ఆయన అన్నారు.
ఆత్మకూరు వైసీపీదే..
ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వైసీపీ తరఫున మేకపాటి రాజగోపాల్ రెడ్డి కుమారుడు విక్రమ్ రెడ్డి ఇక్కడ పోటీ చేశారు. 82,888 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భరత్ కుమార్ యాదవ్పై విజయఢంకా మోగించారు. ఆయనకు 19,352 ఓట్లు పోల్ అయ్యాయి. బీజేపీకి డిపాజిట్లు దక్కలేదు. ఆత్మకూరులో వైసీపీ విజయం సాధించడం వరుసగా ఇది మూడోసారి. 2014, 2019లోనూ ఇక్కడ వైసీపీ గెలుపొందింది.