శబరిమలకు వెళ్లకుండా వైసీపీ మాజీమంత్రిని అడ్డుకోండి- బీజేపీ నేతలు
నెల్లూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు సిటీ శాసన సభ్యుడు, మాజీ మంత్రి పీ అనిల్ కుమార్ యాదవ్ వివాదంలో చిక్కుకున్నారు. అయ్యప్ప స్వామి దీక్షలో ఉంటోన్న ఆయన.. ముస్లిం టోపీ, కండువాను ధరించడం వివాదానికి తెర దారి తీసింది. ఆయన వైఖరి పట్ల భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తోన్నారు. క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. తాజాగా ఆయన ఇంటిని ముట్టడించారు.
కొద్దిరోజుల కిందటే అనిల్ కుమార్ యాదవ్.. అయ్యప్ప స్వామి మాలధారణ చేశారు. నల్ల దుస్తులు ధరించారు. నియమ నిష్ఠలతో స్వామివారిని పూజిస్తోన్నారు. శాసన సభ్యుడి హోదాలో ఆయన ఖుద్దూస్ నగర్లో పర్యటించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్లగొన్నారు. ఆ సమయంలో ఆయన తలపై ముస్లింల సంప్రదాయబద్ధమైన టోపీని ధరించారు. భుజాలపై కండువాను కప్పుకొన్నారు. ఖుద్దూస్ నగర్ నివాసులతో అనిల్ కుమార్ యాదవ్ సమావేశం అయ్యారు.
దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అనిల్ కుమార్ యాదవ్ వైఖరిపై బీజేపీ నాయకులు భగ్గు మంటోన్నారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, బీజేపీ రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణుకుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. అనిల్ కుమార్ మీద చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అయ్యప్ప స్వామి భక్తులను అనిల్ కుమార్ యాదవ్ అవమాన పరిచాడని ధ్వజమెత్తారు.
స్వామివారి దీక్షను ధరించిన భక్తులందరికీ వెంటనే క్షమాపణ కోరాలని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అనిల్ కుమార్ యదవ్ ఇలా బరితెగించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇలాంటి వాటిని హిందూ సమాజం ఎప్పటికీ క్షమించదని బీజేపీ హెచ్చరిస్తోందంటూ విష్ణుకుమార్ రెడ్డి చెప్పారు. దీక్షలో ఉంటూ ముస్లిం టోపీ, కండువా వేసుకొని హిందువులను అవమానపరిచారని.. శబరిమలకు వెళ్లకుండా అడ్డుకోవాలని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు పిలుపునిచ్చారు.
ఇవ్వాళ పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు అనిల్ కుమార్ యాదవ్ ఇంటిని ముట్టడించారు. అయ్యప్ప స్వామి చిత్రపటాన్ని, బీజేపీ జెండాలను పట్టుకుని ఆయన నివాసం ఎదురుగా ఆందోళనకు దిగారు. అనిల్ కుమార్ యాదవ్ క్షమాపణ చెప్పాలంటూ పట్టుబట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ నినదించారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.