ఇస్రో మరో కీలక ప్రయోగం..గ్రాండ్ సక్సెస్: ఈ ఏడాదిలో ఇదే ఫస్ట్
నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్ (పీఎస్ఎల్వీ) సీ-52ను నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించింది. మొదటి లాంచ్ప్యాడ్ నుంచి ఈ తెల్లవారు జామున 5:59 నిమిషాలకు పీఎస్ఎల్వీ సీ-52 నింగిలోకి దూసుకెళ్లింది. . తన వెంట ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ను మోసుకెళ్లింది. ఈ శాటిలైట్తో పాటు మరో రెండు పేలోడ్స్ను సన్ సింక్రొనస్ పోలార్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టింది.
ఈ సంవత్సరంలో ఇస్రో చేపట్టిన మొట్టమొదటి మిషన్ ఇదే. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ ప్రయోగం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఇదివరకే 25 గంటల కౌంట్డౌన్ను చేపట్టిన విషయం తెలిసిందే. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్-4తో పాటు ఐఎన్ఎస్-2టీడీ, ఇన్స్పైర్శాట్-1 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది. వాటిని భూఉపరితలం నుంచి 529 కిలోమీటర్ల ఎత్తున ఉన్న సన్ సింక్రొనస్ పోలార్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టింది.
ఈ ఇన్స్పైర్శాట్-1ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్టీ) విద్యార్థులు రూపొందించారు. అమెరికా కొలరాడోలోని లాబొరేటరీ ఆఫ్ అట్మాస్ఫియర్ అండ్ స్పేస్ ఫిజిక్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల సహకారాన్ని తీసుకున్నారు. దీనితో పాటు భారత్-భూటాన్ జాయింట్ స్పేస్ మిషన్లో భాగంగా రూపొందించిన బౌల్డర్ అండ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ శాటిలైట్ (ఐఎన్ఎస్-2టీడీ)ను ఈ పీఎస్ఎల్వీ సీ-52 నింగిలోకి మోసుకెళ్లింది.
Launch of PSLV-C52/EOS-04 https://t.co/naTQFgbm7b
— ISRO (@isro) February 13, 2022
ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ కాలపరిమితి 10 సంవత్సరాల పాటు సేవలను అందిస్తుంది. వాతావరణ మార్పులు, పరిస్థితులపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుంది. దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఇస్రో శాస్త్రవేత్తలకు అందజేస్తుంటుంది. హై రిజల్యూషన్తో చిత్రీకరించిన వాతావరణ ఫొటోలను పంపిస్తుంది. ఫలితంగా- వ్యవసాయం, అడవులు, పర్యావరణం, భూసారం, హైడ్రాలజీ, ఫ్లడ్ మ్యాపింగ్ వంటి వివిధ రంగాలకు చెందిన కార్యక్రమాలను మరింత ఖచ్చితంగా అంచనా వేయడానికి దోహదపడుతుందీ మిషన్.
#WATCH | Indian Space Research Organisation launches PSLV-C52/EOS-04 from Satish Dhawan Space Centre, Sriharikota
— ANI (@ANI) February 14, 2022
(Source: ISRO) pic.twitter.com/g92XSaHP9r