టీడీపీ-బీజేపీ-జనసేన ఇదీ పిక్చర్: ఒక్క అమరావతి రైతుల పాదయాత్రలో వైరి పక్షాలన్నీ ఏకం
నెల్లూరు: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళన కార్యక్రమాలకు జనసేన పార్టీ తన మద్దతును ప్రకటించింది. ప్రత్యక్ష ఆందోళనలకు దిగింది. రాజధానిగా అమరావతిని కొనసాగింపజేయాలని డిమాండ్ చేస్తూ జగన్ సర్కార్పై ఒత్తిడిని తీసుకుని రానుంది.

అమరావతి రైతుల పాదయాత్రలో..
ఇందులో భాగంగా- అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన పాదయాత్రలో జనసేన పార్టీ పాల్గొనబోతోంది. మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన వైఎస్ జగన్ మనసు మార్చాలంటూ అమరావతి ప్రాంత రైతులు పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ పాదయాత్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి ప్రాంత రైతులు తలపెట్టిన 45 రోజుల పాదయాత్ర ఇది.

నాదెండ్ల మనోహర్ సహా..
నెల్లూరు జిల్లాలోని నార్త్ రాజుపాలెం నుంచి నెల్లూరు వెళ్లే మార్గంలో ఈ మధ్యాహ్నం జనసేన నేతలు, జన సైనికులు ఈ పాదయాత్రలో పాల్గొంటారు. జనసేన సీనియర్ నాయకుడు, రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సహా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన పలువురు నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనబోతున్నారు. రెండు రోజుల పాటు వారంతా ఈ పాదయాత్రతో పాటు కొనసాగే అవకాశం ఉంది.

బీజేపీ ఇదివరకే..
జనసేన మిత్రపక్షం భారతీయ జనతీయ జనతా పార్టీ ఇదివరకే అమరావతి రైతుల నిరసన దీక్షలకు మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ సీనియర్ నాయకులు స్వయంగా పాదయాత్రలో పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ స్థాయి నాయకులు వై సత్యకుమార్, దగ్గుబాటి పురంధేశ్వరి, కేంద్ర మాజీమంత్రి సుజన చౌదరి, సీఎం రమేష్, కన్నా లక్ష్మీనారాయణ వంటి పలువురు నాయకులు రైతులకు అండగా నిలిచారు. వారి పోరాటానికి తమ సంపూర్ణ మద్దతును తెలియజేశారు.

టీడీపీ లీడ్..
అమరావతి రైతులు తలపెట్టిన ఈ నిరసన ప్రదర్శనలు, ఆందోళన కార్యక్రమాలకు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సారథ్యాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. రైతులకు అండగా ఉంటున్నామంటూ టీడీపీ నేతలు తరచూ ఈ నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటూ వస్తోన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ ఆందోళనలకు సారథ్యాన్ని వహించిన సందర్భాలు ఉన్నాయి. రైతులకు మద్దతుగా ఆయన జోలె సైతం పట్టారు.

ఇక జనసేన కూడా..
ఇక జనసేన కూడా అమరావతి ప్రాంత రైతులకు అండగా నిలవనుంది. వారి నిరసన ప్రదర్శనల్లో ప్రత్యక్షంగా పాల్గొనబోతోంది. ఈ ఒక్క పాదయాత్ర తెలుగుదేశం-బీజేపీ-జనసేనను ఒకే తాటిపైకి తీసుకుని వచ్చినట్టయింది. ఇదివరకే సీపీఐ కూడా అమరావతి ప్రాంత రైతులకు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహా మిగిలిన రాజకీయ పార్టీలన్ని కూడా రైతుల పక్షాన నిలిచినట్టయింది.
Recommended Video

అమిత్ షా పర్యటన తరువాత..
అమరావతి ప్రాంత రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడిన ఈ న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రలో జనసేన భాగస్వామ్యం కానుంది. కొద్దిరోజుల కిందటే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఏపీలో పర్యటించారు. అనంతరం ఆయన బీజేపీ రాష్ట్రశాఖ నాయకులతో భేటీ అయ్యారు. అమరావతి ప్రాంత రైతులకు అండగా నిలవాలంటూ అమిత్ షా.. వారికి దిశా నిర్దేశం చేశారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆయన పర్యటించి వెళ్లిన తరువాతే ఈ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.












Click it and Unblock the Notifications