నెల్లూరులో దారుణం... భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త... కరోనా సోకుతుందేమోనన్న అనుమానంతో..
నెల్లూరులో దారుణం జరిగింది. కరోనా సోకిన ఓ మహిళను ఆమె భర్త అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆమె నుంచి తనకెక్కడ కరోనా సోకుతుందేమోనన్న అనుమానంతో ఆమెను హతమార్చాడు. కావలి పట్టణంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
దారుణం... కరోనా సోకిన భార్య తల నరికిన భర్త... ఆపై అపార్ట్మెంట్పై నుంచి దూకి ఆత్మహత్య...
వివరాల్లోకి వెళ్తే... నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఓ మహిళ ఇటీవల కరోనా బారినపడింది. అప్పటినుంచి హోం ఐసోలేషన్లో ఉంటోంది. అయితే కష్టకాలంలో ఆమెకు అండగా నిలబడాల్సిన భర్త ఆమెపై అనవసరంగా కోపం పెంచుకున్నాడు. ఆమె నుంచి ఎక్కడ తనకు వైరస్ సోకుతుందేమోనని అనుమానపడ్డాడు.
ఇదే క్రమంలో గురువారం(మే 6) గొడ్డలితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. మొదట ఆమె రెండు చేతులు నరికాడు. ఆపై ఆమెను హత్య చేసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతను చెప్పింది విని పోలీసులే షాక్ తిన్నారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
గత నెలలో బిహార్లోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. కరోనా సోకిన ఓ మహిళను ఆమె భర్త కిరాతకంగా హత్య చేశాడు. ఆమె తల నరికి హతమార్చాడు. ఆపై అపార్ట్మెంట్ పైనుంచి దూకి అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పత్రకార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్నాచక్ ప్రాంతంలోని ఓం రెసిడెన్సీ అపార్ట్మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కరోనాపై లేని పోని అపోహలు,భయాందోళనతోనే అతను ఈ దారుణానికి పాల్పడ్డాడు.
దేశవ్యాప్తంగా గత ఏడాది కాలంగా కరోనా పట్ల సరైన అవగాహన లేని కారణంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా సోకిందేమోనన్న అనుమానంతో కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కొందరు హత్యలకు పాల్పడుతుండటం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.