కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్: ముగ్గురు కార్మికులు మృతి, మరొకరి పరిస్థితి విషమం
నెల్లూరు: జిల్లాలోని వింజమూరు మండలం చండ్రపడియాలో విషాద ఘటన చోటు చేసుకుంది. రసాయనిక పరిశ్రమలో గ్యాస్ లీకై ముగ్గురు కార్మికులు మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ లీకేజీకి గల కారణాలు తెలియాల్సి ఉంది.
పిడుగుపాటుకు ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు గురై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. హొళగుంద మండలం పెద్దహ్యేట గ్రామానికి చెందిన భోగరాజు(36), మల్లమ్మ(30) దంపతులకు నలుగురు కుమార్తెలు. కుటుంబ పోషణలో భాగంగా తమకున్న 40 మేకలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుమార్తెలు రేవతి(6), మల్లేశ్వరి(4), వెన్నెల(3)తో కలిసి ఈ దంపతులు సోమవారం మేకలను మేపేందుకు గ్రామ శివారుకు వెళ్లారు.
మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. దీంతో అందరూ మేకలను తీసుకుని సమీపంలోని వేపచెట్టు కిందకు వెళ్లారు. అదే సమయంలో చెట్టు వద్ద ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పిడుగు పడింది. దాని ప్రభావంతో భోగరాజు, కుమార్తె రేవతి ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మల్లమ్మ, మల్లేశ్వరిని హొళగుంద ఆస్పత్రికి తరలించారు. మల్లమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఆదోని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో 30 మేకలు కూడా చనిపోయాయి.