గోవర్దన్ రెడ్డి బావ..శ్రీధరా అంటూ : నెల్లూరు పంచాయితీ దేని మీదంటే: మా మధ్య విభేదాలా..!
నెల్లూరు వైసీపీ నేతలు అమరావతిలో సమావేశమయ్యారు. టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి నివాసంలో భేటీ అయి తాజా పరిణామాల మీద చర్చించారు. నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేల మధ్య బయట పడుతున్న విభేదాల గురించి చర్చించి..తన మాటగా వారిని హెచ్చరించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి..సజ్జల రామక్రిష్టారెడ్డి సమావేశమయ్యారు. అధికారుల పైన దురుసుగా వ్యవహరించటం సరి కాదని..ముఖ్యమంత్రి ఆగ్రహంగా ఉన్నారని ఆ ఇద్దరూ నెల్లూరు నేతలకు వివరించినట్లుగా సమాచారం. అదే సమయంలో గత ప్రభుత్వంలో చింతమనేని వైఖరి ..చంద్రబాబు మద్దతుగా నిలిచిన కారణంగా ఆ జిల్లాలో భారీ ప్రభావం చూపించి పార్టీకి అడ్రస్ లేకుండా పోయిందనే విషయాన్ని నేతలు గుర్తు చేసారు.
వ్యాపార సంబంధ వివాదాలు ఉంటే ఇద్దరూ బంధువులే కాబట్టి కూర్చొని మాట్లాడు కోవాలని..ఇలా నేరుగా ఒక ఎమ్మెల్యే మీద అనుచరులతో ఒక ఎమ్మెల్యే ఫిర్యాదు చేయించటం..ఇదే విషయాన్ని మరో ఎమ్మెల్యే మీడియా ముందు మాట్లాడటం వంటి వాటి ద్వారా పార్టీ ప్రతిష్ఠ దెబ్బ తింటుందని వారు క్లాస్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే, సమావేశం బయటకు వచ్చిన తరువాత మాత్రం అసలు వివాదాల గురించి చర్చే లేదని నేతలు చెప్పే ప్రయత్నం చేసారు. కేవలం ఈ నెల 15వ తేదీన నెల్లూరు జిల్లాలో రైతు భరోసా కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేసామని చెప్పుకొచ్చారు.

మా మేనత్త కొడుకు.. మా మధ్య విభేదాలేంటి..
తన పైన కేసు విచారణ సమయంలో అన్ని విషయాలు బయటకు వస్తాయని..తాను ఎటువంటి తప్పు చేయలేదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పుకొచ్చారు. గోవర్ధన్ రెడ్డి తనకు మేనత్త కొడుకు అని చెబుతూ..ఆయన తనను శ్రీధరా అని పిలుస్తారని చెప్పారు. తాజాగా నెల్లూరు రొట్టెల పండుగ సమయంలో ఆయన ఒక పని అప్పచెబితే తానే వెళ్లి చేసానని వివరించారు. అదే విధంగా శ్రీధర్ రెడ్డి ఈ నెల 16 నుండి అమరావతిలోనే ఉంటానని..
నెలకు 25 రోజులు అక్కడే ఉంటానని వెల్లడించారు. గోవర్ధన్ రెడ్డి సైతం ముఖ్యమంత్రి ఆ వ్యవహారం మీద విచారణకు ఆదేశించిన వెంటనే సమస్య ముగిసిపోయిందని..అధికారిణి సైతం సంతోషం వ్యక్తం చేసారని చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్ తొలి సారి జిల్లాకు వస్తున్నారు. దీంతో..ఘనంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. దీని మీదే చర్చ చేసామని..రాజకీయంగా పార్టీ లో ఎటువంటి సమస్యలు లేవని..అపోహలు మాత్రమేనని నేతలు స్పష్టం చేసారు. అయితే ఈ సమావేశానికి ఎంపీ హాజరు కాలేదు.












Click it and Unblock the Notifications