మోడీని చీప్ ప్రధాని అంటారా?.. నువ్వొక జోకర్.. కేసీఆర్పై రాజాసింగ్ సెటైర్లు
నిజామాబాద్ : లోక్సభ ఎన్నికల వేళ నేతల నోట మాటల తూటాలు పేలుతున్నాయి. నువ్వెంతంటే నువ్వెంత అనే రేంజ్ లో ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్పై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. నిజామాబాద్ పార్లమెంటరీ స్థానంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్కు మద్దతుగా.. రోడ్షో లో పాల్గొన్న రాజాసింగ్ కేసీఆర్ను ఏకిపారేయడం చర్చానీయాంశమైంది.
రాత్రి అవి తాగి ఆలోచించు.. చీప్ ఎవరో తెలుస్తుంది..!
దేశాన్ని ప్రగతిపథంలో పరుగులు పెట్టిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని.. చీప్ ప్రధాని అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం తగదన్నారు రాజాసింగ్. రాత్రి కొబ్బరి నీళ్లు తాగే కేసీఆర్.. తెల్లారేసరికి ఏం మాట్లాడతారో తెలియదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల అదృష్టం అట్లుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో ఒక్క జోకర్ ఉంటే.. టీఆర్ఎస్ లో పెద్ద జోకర్ కేసీఆర్ తయారు అయిండని చురకలంటించారు. ఆయన ఒక్క మాట మాట్లాడినా.. మీడియాలో పెద్ద జోక్ అవుతోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలా కేసీఆర్ తెలంగాణలో పెద్ద జోకర్ లా మారిండని అన్నారు.
ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా సంబోధించాలనే విషయం ఆయనకు యాదికి ఉంటలేదని వ్యాఖ్యానించారు. అందుకే ఆయన కొంచెం మెంటల్లీ డిస్ట్రబ్ అయినట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. మోడీని చీప్ ప్రధానిగా ఆయన చెప్పడం హాస్యాస్పదమన్నారు. రాత్రి పూట కొబ్బరి నీళ్లు తాగాక మంచిగా ఆలోచిస్తే చీప్ ఎవరో మీకే అర్థమవుతుందని చురకలు అంటించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కవితను ఓడించి.. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
వైరల్ : ఓట్ల పండుగకు ఆహ్వాన పత్రిక.. వేదిక, ముహుర్తం తెలుసుగా.!
చౌకీదారులా ఉంటాడు..!
నిజామాబాద్ బరిలో ఓటు వేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలన్నారు రాజాసింగ్. టీఆర్ఎస్ కు ఓటు వేస్తే వృధా అవుతుందన్నారు. డబ్బుల కట్టలతో మరోసారి నిజామాబాద్ లో గెలవాని టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కానీ ప్రజలకు సేవ చేసే నాయకున్ని ఎన్నుకోవాలని సూచించారు. అందరూ ఏకతాటిపై నిలిచి మంచి నేతను గెలిపించాలని కోరారు. బీజేపీ అభ్యర్థి అర్వింద్ ను గెలిపిస్తే మీకు చౌకీదారులా ఉంటాడని వ్యాఖ్యానించారు.
టఫ్ ఫైటేనా?
నిజామాబాద్ లోక్సభ బరిలో ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉన్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ తరపున పోటీచేస్తున్న మధుయాష్కి పెద్దగా ప్రచారం చేయడం లేదనే టాక్ నడుస్తోంది. ఆ క్రమంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ తీరుగా ఉంది ఎలక్షన్ల పర్వం. ఈ రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అటు టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత.. బీజేపీని ప్రధానంగా ఫోకస్ చేసి ప్రచారం హీటెక్కిస్తుంటే.. ఇటు బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నారు.
ఇక నిజామాబాద్ పార్లమెంటరీ ఎన్నికల్లో 178 మంది రైతులు పోటీచేస్తుండటం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. టీఆర్ఎస్ ను వ్యతిరేకిస్తూ రైతులు నామినేషన్లు వేయడంతో ఇక్కడి ఎన్నికలపై ఉత్కంఠ పెరుగుతోంది. ఎవరు గెలుస్తారనేది మాత్రం ఓటర్ దేవుళ్లు తమ ఓట్లను నిక్షిప్తం చేసే ఈవీఎంలు తేల్చాల్సిందే తప్ప ఊహించడం కష్టమే.