నిజామాబాద్ పోలింగ్ ... గిన్నిస్ బుక్ లో స్థానం సాధించే రికార్డే
నిజామాబాద్ ఎంపీ స్థానం ... దేశ వ్యాప్త సంచలనం సృష్టించింది . నిజామాబాద్ రైతుల పోరాటపటిమను చాటి చెప్పింది . దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఏకంగా 185 మంది మరీ ముఖ్యంగా రైతులు అభ్యర్థులుగా పోటీ పడటమే ఇందుకు కారణం. చాలా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఉన్న కారణంగా బ్యాలెట్ పోరు జరుగుతుందని భావిస్తే అలా కాకుండా నిజామాబాద్లో అత్యధిక ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించింది ఈసీ. దేశం మొత్తంలో భవిష్యత్ ఎన్నికలకు మార్గదర్శనంగా నిలిచింది నిజామాబాద్ పోలింగ్ .

నిజామాబాద్ పోలింగ్ .. గిన్నిస్ రికార్డుల్లో చేర్చాలని యత్నం
12 ఈవీఎంలను ఒక యూనిట్ గా పెట్టి ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయమే సాహసోపేతమైన నిర్ణయం . ఇక ఆ నిర్ణయాన్ని తీసుకుని పోలింగ్ ను విజయవంతంగా నిర్వహించామని.. అతి పెద్ద బ్యాలెట్ యూనిట్ తో ప్రపంచంలో ఇటువంటి ఎన్నిక తొలిసారి నిర్వహించినందున గిన్నీస్ బుక్ రికార్డుల్లో చేర్చాలని కోరుతూ నిర్వాహకులకు లెటర్ రాశామని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ పేర్కొన్నారు.

ప్రపంచంలోనే తొలిసారి ఈతరహా ప్రయోగం
ప్రపంచంలోనే తొలిసారిగా ఎం-3 రకం ఈవీఎంలతో నిజామాబాద్ లోక్ సభ పోలింగ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ నియోజక వర్గం నుంచి మొత్తం 185 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో 12 ఈవిఎంలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజక వర్గంగా మాత్రమే కాకుండా, అంతమంది కోసం ఈవీఎంలను ఏర్పాటు చేయడం ద్వారా నిజామాబాద్ వార్తల్లోకి ఎక్కింది. ఈ స్థానాన్ని ఎలక్షన్ కమీషన్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పోలింగ్ నిర్వహించింది .

నిజామాబాద్ పోలింగ్ ను గిన్నిస్ రికార్డు ప్రకటించే అవకాశం
ఈ భారీ ఎన్నికలను పరిశీలించాల్సిందిగా గిన్నిస్ బుక్ రికార్డు ప్రతినిధులకు చెప్పిన నేపధ్యంలో ఎన్నికల సరళిని గిన్నిస్ బుక్ అధికారులు తెలుసుకుంటున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఈ తరహా ఇంత భారీ స్థాయిలో ఎన్నికలు జరగలేదు, ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి . కాబట్టి ప్రపంచ రికార్డును ప్రకటించే అవకాశముంది. కాగా అదే జరిగితే ఎన్నిక ప్రక్రియ గిన్నిస్లో చోటు దక్కించుకోవడం ఇదే ప్రథమం కానుంది.












Click it and Unblock the Notifications