ఒక్కరు కాదు ఇద్దరు ప్రియులు: భర్తను చంపేసి సహజీవనం చేస్తోంది!
నిజామాబాద్: కట్టుకున్న భర్త అనే కనికరం కూడా లేకుండా దారుణంగా హత్య చేయించింది ఓ దుర్మార్గురాలు. తన ఇద్దరు ప్రియురాలను పురమాయించి భర్తను హత్య చేయించడం గమనార్హం. ఐదు నెలల తర్వాత సదరు వివాహిత పాల్పడిన ఈ దారుణం పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.

ఏమీ తెలియదంటూనే బెదిరంపులు..
ఘటనకు సంబంధించిన వివరాలను నిర్మల్ డీఎస్పీ ఉపేంద్ర రెడ్డి వెల్లడించారు. ఈ నిజామాబాద్ జిల్లా అంకాపూర్ వాసి గుజ్జేటి ఉదయ్ కుమార్(40) అనే వ్యక్తి అదృశ్యమై ఐదు నెలలు గడుస్తోంది. అయితే, కుటుంబసభ్యులు ఉదయ్ కుమార్ భార్య లావణ్య అలియాస్ పావనిని పలుమార్లు భర్త గురించి అడిగితే తనకు తెలియదని దాటవేసింది.
ఒక రోజు ఉదయ్ కుమార్ కుటుంబసభ్యులు పావని అద్దెకుంటున్న నివాసానికి వెళ్లగా దవాతే దౌలాజీ అలియాస్ రమేశ్(25)తో కలిసి ఉంది. అంతేగాక, భర్త ఉదయ్ కుమార్ ఎటు వెళ్లాడో తనను ఎందుకు అడుగుతున్నారంటూ ఇద్దరూ గట్టిగా బెదిరించారు. అంతటితో ఆగకుండా ఉదయ్ సోదరి పట్ల రమేశ్ అసభ్యప్రవర్తిస్తూ.. మరో ప్రశ్నిస్తే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగాడు.

భర్తను కాదని మరొకరితో సహజీవనం..
ఈ క్రమంలో కుటుంబసభ్యులు వారిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత వారు కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో అనుమానం వచ్చిన పోలీసులు వారిద్దరిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఉదయ్ కుమార్ అనుమానాస్పద కేసు ఛేదించాలని జిల్లా ఉన్నతాధికారులు డీఎస్పీ ఉపేంద్రరెడ్డిని ఆదేశించారు. దీంతో సోన్ సీఐ జీవన్ రెడ్డి, మామడ ఎస్ఐ ఆసిఫ్ కేసు విషయమై పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. లంకాపూర్లో ఐదు నెలల క్రితం అదృశ్యమైన ఉదయ్ కుమార్ ఆచూకీ ఇప్పటికీ లభించలేదని.. ఆయన భార్య మరొకరితో సన్నిహితంగా ఉంటోందన్న సంగతి తెలిసింది. ఇప్పటికే నిఘా పెట్టిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

ఎలాగైనా భర్తను తొలగించుకోవాలని..
తాజాగా మామడ సమీపంలో వాహన తనిఖీల్లో దౌలాజీతో బైక్పై పావని వెళ్తుండగా పట్టుకున్నారు. వారిని విచారిస్తే హత్య విషయం బయటకొచ్చింది. అంతేగాక, ఈ హత్య కేసులో నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం ఛేంగల్కు చెందిన ముదురుకోల గంగాధర్ ప్రమేయమూ ఉన్నట్లు నిందితులిద్దరూ చెప్పారు. కాగా, కామారెడ్డి జిల్లా మద్నూరు మంలం తాడ్గూరుకు చెందిన దౌలాజీ అలియాస్ రమేశ్, చేంగల్కు చెందిన గంగాధర్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో తమ వ్యవహారాలకు భర్త అడ్డువస్తున్నాడని.. అతడ్ని ఎలాగైనా తొలగించాలని కుట్ర పన్నింది. ఈ నేపథ్యంలో మూడేళ్ల కూతురుకు పుట్టు వెంట్రుకలు తీసేందుకు డబ్బులు అవసరమని.. రమేశ్, గంగాధర్ ఇస్తారని వారితో భర్తను పంపించింది.

మద్యం తాగించి పావని భర్తను హత్య చేసిన ప్రియులు
ఇక ఉదయ్ కుమార్ను మామడ మండలం పొస్కల్కు తీసుకొచ్చిన రమేశ్, గంగాధర్.. మద్యం తాగించారు. వారు కూడా తాగారు. ఆ తర్వాత పావనికి ఫోన్ చేసి.. ఉదయ్ కుమార్ ను చంపమంటావా? అని అడిగారు వారిద్దరూ. ఆమె చంపమని చెప్పడంతో.. ఉదయ్ కుమార్ ను గోదావరి నదిలోకి తీసుకెళ్లి ముంచారు. ఊపిరాడకపోవడంతో 5 నిమిషాల తర్వాత ఉదయ్ కుమార్ చనిపోయాడు. అతడ్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు రమేశ్, గంగాధర్. హత్య కేసులో నిందితుడైన గంగాధర్ కొద్ది రోజుల క్రితం దుబాయ్ వెళ్లాడు. ఇక ఇక్కడే ఉన్న రమేశ్తో పావని సహజీవనం చేస్తోంది.

పోలీసుల లోతుగా విచారించడంతో..
కాగా, జూన్ 9న మామడ మండలం పొస్కల్ గోదావరిలో గుర్తు తెలియని వ్యక్తి శవం కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లు సర్పంచ్ భూమేశ్వర్ ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడి దగ్గర లభించిన కొన్ని ఆధారాలు, శవం పొటోలను సరిహద్దు జిల్లాల పోలీస్ స్టేషన్లకు పంపించారు. దీంతో ఆ శవం ఉదయ్ కుమార్ది గుర్తించారు పోలీసులు. లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులకు.. పావని చేసిన దారుణం వెలుగుచూసింది. దీంతో పావనితోపాటు రమేశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్లో ఉన్న గంగాధర్ను కూడా తిరిగి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ ఉపేంద్ర తెలిపారు.












Click it and Unblock the Notifications