తేజస్విని ఆత్మహత్య కలచివేసింది... ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు... : చంద్రబాబు నాయుడు
ప్రకాశం జిల్లా ఒంగోలులో బీటెక్ విద్యార్థిని తేజస్విని ఆత్మహత్యపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. కాలేజీ ఫీజు చెల్లించలేక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం తన మనసును కలచివేసిందన్నారు. ఇలాంటి ఘటన బాధాకరమని... రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఏమైందని,ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని... ఆమె కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఒంగోలులోని గొడుగుపాలెంకు చెందిన పాపిశెట్టి తేజస్విని(19) కాలేజీ ఫీజులు చెల్లించలేక శుక్రవారం(ఫిబ్రవరి 5) అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తేజస్విని ఒంగోలు పట్టణంలోని క్విస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీఈ సెకండియర్ చదువుతోంది.

ఆమె తండ్రి నాగేశ్వరరావు కూలీగా పనిచేస్తున్నారు. ఆయనకు వచ్చే డబ్బులతో కుటుంబం కష్టంగా నెట్టుకొస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నాగేశ్వరరావు ఇటీవలే రూ.35వేలు తేజస్విని కాలేజీ ఫీజు చెల్లించాడు. అయితే మిగతా ఫీజు చెల్లించడం తనవల్ల కాదని చెప్పడంతో తేజస్విని మనస్తాపానికి గురైంది.
చదువుకు దూరమవుతానన్న ఆవేదనతో బలవన్మరణానికి పాల్పడింది. తేజస్విని ఆత్మహత్య విషయం తెలిసి విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. విద్యార్థులను ఫీజుల పేరుతో వేధిస్తున్నారంటూ కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టాయి. క్విస్ కాలేజీ అటానమస్ హోదాను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. దీనిపై ఒంగోలు ఆర్డీవో ప్రభాకర్ రెడ్డి,డీఎస్పీ ప్రసాద్లకు విద్యార్థి సంఘం నేతలు వినతిపత్రం అందజేశారు.
మరోవైపు తేజస్వి ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఆమె ఇంటికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications