Disha Police Station: దిశ పోలీస్ స్టేషన్లు ముస్తాబు: ఒకేసారి 18: వైఎస్ జగన్ చేతుల మీదుగా..!
కాకినాడ: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్లు శనివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. మహిళలు, చిన్న పిల్లలపై అత్యాచారాలు, హత్యాకాండల దోషులకు 21 రోజుల్లో ఉరిశిక్ష విధించడానికి రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన దిశ చట్టంలో భాగంగా.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఆయా పోలీస్ స్టేషన్లను ప్రారంభించనున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో నెలకొల్పిన దిశ పోలీస్ స్టేషన్ను ఆయన శనివారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభిస్తారు. అక్కడి నుంచే రిమోట్ ద్వారా ఇతర జిల్లాల్లో ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్లను లాంఛనంగా ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నిజానికి- ఈ పోలీస్ స్టేషన్లు శుక్రవారం నుంచే తమ కార్యకలాపాలను ఆరంభించాల్సి ఉంది. 18 స్టేషన్లనూ ఒకేసారి అందుబాటులోకి తీసుకుని రావాల్సి ఉన్నందున.. ఒకరోజు వాయిదా వేశారు.

రాజమహేంద్రవరంలో పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన అనంతరం ఆయన నన్నయ విశ్వవిద్యాలయానికి బయలుదేరి వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసిన దిశ వర్క్షాప్లో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఈ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వెంట హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్, ఇతర ఉన్నతా ధికారులు హాజరవుతారు.












Click it and Unblock the Notifications