న్యూడ్ ఫొటోలు పంపిస్తామని వేధింపులు - భార్యాభర్త ఆత్మహత్య...!!
రూ 50 వేల అప్పు భార్యా భర్తల ప్రాణాలు బలిగొంది. రుణం తీర్చకుంటే న్యూడ్ ఫొటోలు..వీడియోలు పంపిస్తామంటూ లోన్ యాప్ నిర్వాహకుల హెచ్చరికలతో ఆ ఇద్దరు బలవర్మణానికి పాల్పడ్డారు. దీంతో.. తమ తల్లి తండ్రులు ఇక రారనే విషయం తెలియక ఇద్దరు చిన్నారులు వేచి చూస్తున్న తీరు చూసిన వారిని కలిచి వేస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆన్లైన్ రుణయాప్ల కారణంగానే వీరు బలవన్మరణం పొందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులతో
జిల్లాలోని రాజవొమ్మంగి మండలం లబ్బర్తికి చెందిన కొల్లి దుర్గారావు పదేళ్ల కిందట జీవనోపాధి నిమిత్తం రాజమహేంద్రవరం వచ్చారు. ఆరేళ్ల కిందట రమ్యలక్ష్మితో వివాహమైంది. నగరంలోని శాంతినగర్లో నివాసముంటున్నారు. వీరికి తేజస్వి నాగసాయి(4), లిఖితశ్రీ(2) ఇద్దరు సంతానం. దుర్గారావు పెయింటింగ్, రమ్యలక్ష్మి టైలరింగ్ చేస్తున్నారు. దంపతులు తమ అవసరాల నిమిత్తం ఇటీవల ఆన్లైన్ యాప్ లో 50,000 లోన్ తీసుకున్నారు. కానీ, నిర్దేశిత సమయంలో వారు తిరిగి రుణం చెల్లించలేక పోయారు. దీంతో..రుణ యాప్ నిర్వాహకుల నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. కొంత మొత్తం నగదును చెల్లించారు. మరింత చెల్లించాలని, లేదంటే రమ్యలక్ష్మి ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తామంటూ బెదిరించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

భార్య - భర్త బలవన్మరణం
రెండు రోజుల సమయంలోగా పూర్తి రుణం చెల్లించాలని డెడ్ లైన్ విధించారు. దీంతో.. దంపతులు ఇద్దరూ ఆ రుణం చెల్లించలేక...వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించారు. దీని కోసం నగరంలోని గోదావరి గట్టున ఉన్న ఒక లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. ఆ రోజు అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో బావ రాజేష్కు రమ్యలక్ష్మి ఫోన్ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి కాల్ కట్ చేశారు. దీంతో వారు హోటల్ వద్దకు వచ్చే సరికి వారిద్దరూ విషం తీసుకొని విగత జీవులుగా మారి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. ఇద్దరూ ప్రాణాలు వదిలినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఇద్దరు పిల్లలకు సీఎం జగన్ సాయం
ఆసుపత్రి వర్గాల సమాచారం మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ అమ్మా - నాన్న మరణించిన విషయం అర్దం చేసుకోలేని వయసులో ఉన్న వారి పిల్లలు ఇద్దరూ..తన జన్మదినం కావటంతో కేక్ తేవటానికి వెళ్లారా ..అంటూ ప్రశ్నించటం అందరినీ కలిచి వేస్తోంది. తమ తల్లి తండ్రులు దేవుడి దగ్గరకు వెళ్లారంట అంటూ..వారు తమ బంధువులకు చెప్పటం చూస్తున్న వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. అయితే, ఈ ఘటన తెలుసుకున్న ముఖ్యమంత్రి ఆ చిన్నారులిద్దరికీ రూ 5 లక్షల చొప్పున సాయం ప్రకటించారు.












Click it and Unblock the Notifications