వైసీపీ అండ.. ఎన్నికల అధికారుల అరాచకం: ఢిల్లీ వెళ్తా..అమిత్ షాను కలుస్తా: పవన్ కల్యాణ్ వార్నింగ్
రాజమహేంద్రవరం: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రక్రియను ఆరు వారాల పాటు వాయిదా వేయడాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తప్పు పట్టారు. ఈ ఎన్నికలను తాము వాయిదా వేయమని కోరలేదని, అయినప్పటికీ ఎందుకు వాయిదా వేశారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల ప్రక్రియను మొత్తానకే రద్దు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కేంద్రం దృష్టికి అధికారుల తీరు..
ఆదివారం ఉదయం ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన విలేెకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పు చేతల్లో నడుచుకుంటున్నారని ధ్వజమెత్తారు. వారిపై తాము కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ అధికారులపై మాత్రమే కాకుండా.. అధికార పార్టీకి సహకరించిన వారందరి తీరునూ కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.

వాయిదా మాత్రమే సరిపోదు..
స్థానిక ఎన్నికలను వాయిదా వేసినంత మాత్రాన సరిపోదని, ఆ ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి చేపట్టాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఇప్పటివరకు జరిగిన ప్రక్రియను రద్దు చేయాలని అన్నారు. ఎన్నికల కమిషన్ అధికారులు వైసీపీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో హింస, దౌర్జన్యాలపై తాము చెప్పినవే నిజమయ్యాయని పవన్ కల్యాణ్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటిదాకా చోటు చేసుకున్న హింస, దౌర్జన్యాలపై నివేదికలు తయారు చేస్తున్నామని తెలిపారు.

వైసీపీ నేతలకు వంత పాడుతోన్న అధికారులు..
వైసీపీ పెద్దలకు వంత పాడుతూ, వారి అడుగులకు మడుగులొత్తుతూ, తప్పులు చేసిన అధికారులపై కేంద్రానికి నివేదికను పంపిస్తామని పవన కల్యాణ్ హెచ్చరించారు. అధికారులపై నివేదికను ఢిల్లీకి వెళ్తామని కేంద్ర ఎన్నికల కమిషన్కు నివేదిక అందిస్తామని అన్నారు. రాష్ట్రంలో భయానక వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగిందని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులను వైసీపీ నాయకులు భయపెట్టి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారని, వారికి అధికారులు సహకరించారని అన్నారు.

వీడియోలు, ఆడియో క్లిప్పింగులతో సమా..
రాష్ట్రంలో స్థాని సంస్థల ఎన్నికల ప్రక్రియ సందర్భంగా ఇప్పటిదాకా నమోదైన ఘటనలు, చోటు చేసుకున్న పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని, వారిని కలుస్తామని అన్నారు. వైసీపీ నేతల దాడులకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు అమిత్ షాకు అందజేస్తామని హెచ్చరించారు. జనసేన మహిళా నేతలపై దాడుల చేస్తే వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. 13 జిల్లాలో వైసీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications