Margani Bharat : ఈసారి ఎమ్మెల్యేగా పోటీ ? తేల్చేసిన రాజమండ్రి ఎంపీ భరత్..
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 22 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. మరోసారి అదే ఫీట్ రిపీట్ చేసేందుకు సిద్దమవుతోంది. వీలైతే 25 ఎంపీ సీట్లను తన ఖాతాలో వేసుకునే దిశగా పావులు కదుపుతోంది. అయితే గతంలో తొలిసారి ఎంపీలుగా పోటీ చేసి గెలిచిన వారంతా తిరిగి ఎంపీలుగా పోటీ చేసేందుకు ఇష్టపడటం లేదు. వీరిలో చాలా మంది తమకు ఈసారి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ ను కోరుతున్నారు.
ఇదే క్రమంలో రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ కూడా ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు మొగ్గుచూపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. వీటిపై తాజాగా భరత్ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో తన పోటీపై ఎంపీ భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తన పార్లమెంట్ సీటు పరిధిలోకి వచ్చే నిడదవోలు నియోజకవర్గం నుంచి పోటీచేయాలని ఆయన ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న తరుణంలో దీనిపైనా భరత్ స్పందించారు.

వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నానని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ వెల్లడించారు. తన పోటీపై అధినేత జగన్ దే తుది నిర్ణయం అన్నారు. నిడదవోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచన తనకు లేదన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలైన రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తామని భరత్ ధీమా వ్యక్తం చేసారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీ సీటును వైసీపీ గెల్చుకున్నా.. రాజమండ్రి సిటీ, రూరల్ సీట్లను టీడీపీ కైవసం చేసుకుంది. సిటీ నుంచి ఆదిరెడ్డి భవానీ, రూరల్ నుంచి సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో ఈసారి ఆయా సీట్లలో గెలుపుపై వైసీపీ పక్కా ప్రణాళికలు రచిస్తోంది. ఇదే క్రమంలో మార్గాని భరత్ రాజమండ్రి సిటీ నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. అదే జరిగితే బీసీ సామాజికవర్గానికి చెందిన భరత్.. సిట్టింగ్ బీసీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మధ్య పోరు తప్పదు.












Click it and Unblock the Notifications