రాజమండ్రి ఎంపీ భరత్ చాకచక్యం- గోదావరిలో దూకబోయిన యువకుడిని రక్షించిన వైనం..
ఏపీలోని రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ చాకచక్యం ఇవాళ ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న ఓ యువకుడి ప్రాణం కాపాడింది. రాజమండ్రి రోడ్డు కమ్ రైలు వంతెనపై ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ యువకుడిని అటుగా వెళ్తున్న ఎంపీ కాపాడిన ఈ ఘటన స్ధానికంగా చర్చనీయాంశమైంది.
రాజమండ్రి పరిధిలోకి వచ్చే ఉనకరమిల్లి (నిడదవోలు మండలం) నుండి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బైక్ పై రాజమండ్రి- కొవ్వూరు రోడ్డు కం రైలు వంతెనపైకి చేరుకున్న ఓ యువకుడి, వంతెనపై బైక్ ఆపి, ఒక్కసారిగా గోదావరిలో దూకేందుకు సిద్ధమయ్యాడు. సరిగ్గా అదే సమయంలో గోపాలపురంలోని ఒక శుభ కార్యక్రమాలు బయల్దేరిన రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ కంట ఈ దృశ్యం పడింది. అంతే ఆయన వాహనాన్ని ఆపారు. కారులో నుండి ఒక్క ఉదుటున దూకి, ఆ యువకుని కాలర్ పట్టుకుని వెనక్కి లాగారు.

ఆ తరువాత యువకుని చేయి పట్టుకుని ఫుట్ పాత్ పై నుంచి రోడ్డు మీదకు బలంగా లాగిన ఎంపీ.. తన అనుచరుల సాయంతో పట్టుకున్నారు. ఈ హఠాత్పరిణామానికి ఆ యువకుడు కూడా షాకయ్యాడు. కొద్దిసేపు ఆ షాక్ నుండి తేరుకోలేకపోయాడు. ఆ తర్వాత ఆ యువకుడికి వచ్చిన ఇబ్బందిని ఎంపీ తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కానీ అతను పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో వెంటనే రాజమండ్రి టూ టౌన్ సీఐ గణేష్ కు ఫోన్ చేసి కౌన్సెలింగ్ ఇమ్మని ఎంపీ భరత్ తెలిపారు. ఆటోలో కొంతమంది సహాయంతో నగరంలోని రెండవ పట్టణ పోలీసు స్టేషన్ కు తరలించారు.
విచారణలో ఆ యువకుని పేరు అయ్యప్ప అని, తండ్రి పేరు సీతాపతిరావు అని పోలీసులకు చెప్పాడు. తన తల్లిదండ్రులకు ఆరవ సంతానంగా తాను జన్మించానని, తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేసి, జడ్చర్ల అరబిందో ఫార్మసీ లో మూడు సంవత్సరాలు జాబ్ చేసినట్టు పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పాడు. కాగా యువకుడిని కాపాడిన ఎంపీ భరత్ ను పలువురు అభినందించారు.












Click it and Unblock the Notifications